
అబుదాబి: పెద్దగా అంచనాలే లేకుండా బరిలోకి దిగి సంచలన ఆటతో చెలరేగిపోతున్న పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. వరుసగా నాలుగో విజయంతోగ్రూప్2 టాపర్గా అందరికంటే ముందే సగర్వంగా సెమీస్లోకి అడుగుపెట్టింది. భారత్, న్యూజిలా, అఫ్గానిస్థాన్లపై హ్యాట్రిక్ విజయాల జోరును కొనసాగించిన పాక్ మంగళవారం జరిగిన మ్యాచ్లో చిన్న జట్టు నమీబియాను 45 పరుగుల తేడాతో ఓడించింది.
ఓపెనర్లు మహమ్మద్ రిజ్వాన్(50 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 నాటౌట్), బాబర్ ఆజమ్(49 బంతుల్లో 7 ఫోర్లతో 70) హాఫ్ సెంచరీతో విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 189 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 144/5 స్కోర్ చేసి ఓడింది. డేవిడ్ వీస్(43 నాటౌట్), క్రెయిగ్ విలియమ్స్(40), స్టెఫన్ బార్ట్(29) తమ పోరాటంతో ఆకట్టుకున్నారు. పాకిస్థాన్ కట్టుదిట్టమైన బౌలింగ్ను ఎదుర్కొని నమీబియా ఆడిన తీరుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.
నమీబియా పోరాటానికి ఫిదా అయిన పాకిస్థాన్ ఆటగాళ్లు సైతం మ్యాచ్ ముగిసిన అనంతరం వారి డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లి ప్రశంసించారు. బాధలో ఉన్న ఆటగాళ్లను ఓదార్చి క్రీడాస్పూర్తి ప్రదర్శించి అభిమానుల మనసు గెలుచుకున్నారు. సెలక్షన్ మేనేజర్ సహా మహ్మద్ హపీజ్, హసన్ అలీ, షాహిన్ అఫ్రిది, షాబాద్ ఖాన్, ఫఖర్ జమాన్లు కలిసి నమీబియా డ్రెస్సింగ్రూమ్కు వచ్చి వారిని అభినందించారు. దీనికి సంబంధించిన వీడియోను పాకిస్థాన్ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకోవడంతో వైరల్గా మారింది.
'మ్యాచ్లో ఓడిపోయామని బాధపడకండి.. చాలా మంచి ప్రదర్శన ఇచ్చారు. మాకు పోటీగా పరుగులు సాధిస్తూ మమ్మల్ని కాసేపు ఆందోళన పడేలా చేశారు. అయితే మ్యాచ్లో గెలుపోటములు సహజం. డేవిడ్ వీస్ ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మిగతా మ్యాచ్ల్లో గెలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.. ఆల్ ది బెస్ట్'అంటూ నబీబియా ఆటగాళ్లకు ధైర్యాన్నిచ్చే ప్రయత్నం చేశారు. నమీబియా క్రికెటర్లను హగ్ చేసుకొని మరి వారి ఆట తీరును అభినందించారు.
కాగా ఈ వీడియోనూ పీసీబీ ట్విటర్ వేదికగా షేర్ చేయడంతో వైరల్గా మారింది. ఇక పాకిస్థాన్ క్రీడాస్పూర్తిని ప్రదర్శించిన తీరుకు క్రికెట్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. ''ఓడిన జట్టు బాధలో ఉన్నప్పుడు వారికి ధైర్యం చెప్పడం ధర్మం.. ఈరోజు పాకిస్థాన్ దానిని చేసి చూపించింది'అని కామెంట్ చేస్తున్నారు.