బౌలింగ్ వైఫల్యంతోనే ఇంగ్లండ్తో తొలి టెస్ట్లో ఓటమిపాలయ్యామని పాకిస్థాన్ కెప్టెన్ షాన్ మసూద్ అన్నాడు. 556 పరుగుల భారీ స్కోర్ చేసినప్పుడు.. బౌలర్లు అండగా నిలవాల్సిందని అభిప్రాయపడ్డాడు. ముల్తాన్ వేదికగా శుక్రవారం ముగిసిన ఈ మ్యాచ్లో పాకిస్థాన్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ ఘోర పరాజయంతో పాకిస్థాన్ అత్యంత చెత్త రికార్డ్ను తమ పేరిట లిఖించుకుంది. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే మరే జట్టు నమోదు చేయని చెత్త రికార్డ్ను తమ ఖాతాలో వేసుకుంది. తొలి ఇన్నింగ్స్లో 550 ప్లస్ రన్స్ చేసినా ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడం టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇదే తొలిసారి. ఆ అప్రతిష్టను పాకిస్థాన్ మూటగట్టుకుంది.

బౌలింగ్ వైఫల్యమే..
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన షాన్ మసూద్ బౌలింగ్ వైఫల్యం తమ పతనాన్ని శాసించిందని చెప్పాడు. 'మనమంతా మూడో ఇన్నింగ్స్ వైఫల్యం గురించే మాట్లాడుతున్నాం. కానీ క్రికెట్ అనేది టీమ్ గేమ్. 550 పరుగుల భారీ స్కోర్ చేసినప్పుడు 10 వికెట్లు తీసి బౌలర్లు అండగా నిలవాల్సింది. కానీ మా బౌలర్లు అలా చేయలేకపోయారు. ఈ తప్పిదమే మా పతనాన్ని శాసించింది.
తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్, బౌలింగ్ ఎలా చేయాలి?.. ఆధిక్యం ఎలా సాధించాలి? ఆ ఆధిక్యంతో మ్యాచ్ను ఎలా ముగించాలి? అనేవి ఇంగ్లండ్ను చూసి మేం నేర్చుకోవాల్సి ఉంది. 20 వికెట్లు పడగొట్టేందుకు వారు మార్గాలు కనుగొన్నారు. మా జట్టు ముందున్న అతిపెద్ద సవాల్ కూడా ఇదే. ప్రస్తుతం మేం సిరీస్ మధ్యలో ఉన్నాం. జట్టు మెంటాలిటీ గురించి మాట్లాడుకున్నాం. టెస్ట్ ఫార్మాట్ అత్యుత్తమైన ఫార్మాట్. మెరుగైన ప్రదర్శన చేసిన జట్టును విజయం వరిస్తోంది. పరుగులు చేయడం, వికెట్లు తీయడం విస్మరించలేనివి.
220 ఆలౌట్..
152/6 ఓవర్నైట్ స్కోర్తో చివరి రోజు ఆటను కొనసాగించిన పాకిస్థాన్ మరో 68 పరుగులు మాత్రమే జోడించి రెండో ఇన్నింగ్స్లో 220 పరుగులకు ఆలౌటైంది. అఘా సల్మాన్(63), ఆమీర్ జమాల్(55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. ఆఖరి బ్యాటర్ అబ్రార్ అహ్మద్ జ్వరం కారణంగా బ్యాటింగ్కు రాలేదు. దాంతో అంపైర్లు పాకిస్థాన్ ఆలౌటైనట్లుగా ప్రకటించారు.
ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ జాక్ లీచ్ నాలుగు వికెట్లు తీయగా.. గస్ అట్కిన్సన్, కార్సె రెండేసి వికెట్లు పడగొట్టారు. క్రిస్ వోక్స్కు ఓ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్లో 556 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఇంగ్లండ్ 823/7
అనంతరం ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్ను 823/7 రికార్డ్ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. హ్యారీ బ్రూక్(322 బంతుల్లో 29 ఫోర్లు, 3 సిక్స్లతో 317) ట్రిపుల్ సెంచరీతో చెలరేగగా.. జో రూట్(375 బంతుల్లో 17 ఫోర్లతో 262) రికార్డ్ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. దాంతో ఆ జట్టుకు 267 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. ఇంగ్లండ్ సాధించిన ఆధిక్యాన్ని కూడా పాకిస్థాన్ అందుకోలేకపోయింది. త్రిశతకంతో సత్తా చాటిన హ్యారీ బ్రూక్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.