పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్, స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిదీ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి కారణంగా పాకిస్థాన్ క్రికెట్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్ రెండు వర్గాలుగా చీలినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆటగాళ్ల గొడవల కారణంగానే పాకిస్థాన్ జట్టు దారుణ పరాజయాలను మూటగట్టుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ విమర్శలను పాకిస్థాన్ మేనేజ్మెంట్ ఎప్పటికప్పుడూ తిప్పికొడుతున్నా.. ఆటగాళ్లు మాత్రం మైదానంలోనే గొడవకు దిగుతున్నారు. తాజాగా ఇంగ్లండ్తో ముగిసిన తొలి టెస్ట్లోనూ షాహిన్ అఫ్రిదీ, బాబర్ ఆజామ్ గొడవపడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా షాహిన్ అఫ్రిదీ.. బాబర్ ఆజామ్ బ్యాటింగ్ వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ ఎగతాళి చేసినట్లు ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది.

జింబూ అంటే..?
ఈ వీడియోలో షాహిన్ అఫ్రిది.. బాబర్ ఆజామ్ను ఉద్దేశించి జింబూ, జింబూ అని గట్టిగా అరుస్తున్నాడు. జింబూ అనేది బాబర్ ఆజామ్కు అతని హేటర్స్ పెట్టిన పేరు. బాబర్ ఆజామ్ పసికూన జట్లపైనే పరుగుల మోత మోగిస్తాడని, జింబాబ్వే వంటి చిన్నదేశాలపై మాత్రమే సెంచరీలు సాధిస్తాడని, బలమైన జట్లపై దారుణంగా విఫలమవుతాడనే అభిప్రాయం ఉంది.
ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు బాబర్ ఆజామ్ను జింబూ అనే నిక్ నేమ్తో ఎగతాళి చేస్తారు. సోషల్ మీడియా వేదికగా బాబర్ ఆజామ్ను ట్రోల్ చేసేందుకు ఈ పదాన్ని వినియోగిస్తారు. అయితే ఈ పదాన్ని తాజాగా షాహిన్ అఫ్రిదీ వాడటం చర్చనీయాంశమైంది. ఇంకా పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూమ్లో గొడవలు సెట్ అవ్వలేదని ఈ వీడియోతో అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
కెప్టెన్సీ మార్పుతో గొడవ..
కెప్టెన్సీ విషయంలో బాబర్ ఆజామ్, షాహిన్ అఫ్రిదికి గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలకు పీసీబీ అనాలోచిత నిర్ణయాలు కూడా ఆజ్యం పోసాయి. వన్డే ప్రపంచకప్ 2023 పరాజయం అనంతరం బాబర్ ఆజామ్ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో షాహిన్ అఫ్రిదిని సారథిగా ఎంపిక చేశారు.
అయితే ఫిట్నెస్ సమస్యలతో బాధపడిన అతన్ని.. టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభానికి ముందు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి మళ్లీ బాబర్ ఆజామ్కు అప్పగించారు. దాంతో ఈ ఇద్దరి మధ్య గొడవలు తారా స్థాయికి చేరాయి. దాంతో మెగా టోర్నీలో పాక్ లీగ్ దశలోనే వెనుదిరిగాల్సి వచ్చింది.
గత రెండేళ్లుగా బాబర్ ఆజామ్ దారుణంగా విఫలమవుతున్నాడు. 2022 డిసెంబర్లో అతను చివరిసారిగా శతకం సాధించాడు. ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్ట్లోనూ దారుణంగా విఫలమయ్యాడు.
ఈ మ్యాచ్లో పాకిస్థాన్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలి ఇన్నింగ్స్లో 556 పరుగులు చేసినా ఘోర ఓటమిని మూటగట్టుకుంది.