పాకిస్థాన్ క్రికెట్ టీమ్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్లో క్లీన్ స్వీప్ అయిన పాకిస్థాన్.. తాజాగా ఇంగ్లండ్తో తొలి టెస్ట్లో ఇన్నింగ్స్ తేడాతో చిత్తయ్యింది. ముల్తాన్ వేదికగా శుక్రవారం ముగిసిన ఈ మ్యాచ్లో పాకిస్థాన్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ ఘోర పరాజయంతో పాకిస్థాన్ అత్యంత చెత్త రికార్డ్ను తమ పేరిట లిఖించుకుంది. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే మరే జట్టు నమోదు చేయని చెత్త రికార్డ్ను తమ ఖాతాలో వేసుకుంది. తొలి ఇన్నింగ్స్లో 550 ప్లస్ రన్స్ చేసినా ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడం టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇదే తొలిసారి. అంతేకాకుండా ఇరు జట్లు తమ తొలి ఇన్నింగ్స్ల్లో 550 ప్లస్ రన్స్ నమోదు చేసిన సందర్భంలో ఫలితం తేలిన రెండో మ్యాచ్ కూడా ఇదే.

ఇంగ్లండ్తోనే 2022లో జరిగిన మ్యాచ్లోనూ పాకిస్థాన్ 74 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 152/6 ఓవర్నైట్ స్కోర్తో చివరి రోజు ఆటను ప్రారంభించిన పాకిస్థాన్ మరో 68 పరుగులు మాత్రమే జోడించి రెండో ఇన్నింగ్స్లో 220 పరుగులకు ఆలౌటైంది. అఘా సల్మాన్(63), ఆమీర్ జమాల్(55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది.
ఆఖరి బ్యాటర్ అబ్రార్ అహ్మద్ జ్వరం కారణంగా బ్యాటింగ్కు రాలేదు. దాంతో అంపైర్లు పాకిస్థాన్ ఆలౌటైనట్లుగా ప్రకటించారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ జాక్ లీచ్ నాలుగు వికెట్లు తీయగా.. గస్ అట్కిన్సన్, కార్సె రెండేసి వికెట్లు పడగొట్టారు. క్రిస్ వోక్స్కు ఓ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్లో 556 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.
అనంతరం ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్ 823/7 రికార్డ్ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. హ్యారీ బ్రూక్(322 బంతుల్లో 29 ఫోర్లు, 3 సిక్స్లతో 317) సెంచరీతో చెలరేగగా.. జో రూట్(375 బంతుల్లో 17 ఫోర్లతో 262) రికార్డ్ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. దాంతో ఆ జట్టుకు 267 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. ఇంగ్లండ్ సాధించిన ఆధిక్యాన్ని కూడా పాకిస్థాన్ అందుకోలేకపోయింది. త్రిశతకంతో సత్తా చాటిన హ్యారీ బ్రూక్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
సొంతగడ్డపై పాకిస్థాన్కు ఇది వరుసగా ఆరో ఓటమి కావడం విశేషం. గత 9 టెస్ట్ల్లో పాక్ ఏడింట్లో ఓటమిపాలైంది. మార్చి 2022 నుంచి తాజా మ్యాచ్ వరకు పాకిస్థాన్ సొంతగడ్డపై ఒక్క టెస్ట్ మ్యాచ్ గెలవలేదు. మొత్తం 11 టెస్ట్లు ఆడగా.. ఏడింటిలో ఓటమిపాలైంది. నాలుగు మ్యాచ్లు డ్రా అయ్యాయి.