స్టేడియంలో క్రికెట్ మ్యాచ్లు చూసేందుకు పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తి చూపడం లేదని ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ ధరలను తగ్గించి అభిమానులను మైదానాలకు తీసుకురావాలని నిర్ణయించింది. ఇటీవల నిర్వహించిన పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)కు కూడా ప్రేక్షకాదరణ అంతంత మాత్రంగానే ఉండటంతో స్టేడియాలన్నీ ఖాళీగా కనిపించాయి.
ఈ క్రమంలోనే సొంతగడ్డపై బంగ్లాదేశ్తో జరగనున్న టెస్ట్ సిరీస్ మ్యాచ్లకు టికెట్ ధరలను తగ్గించింది. ఇరు జట్ల మధ్య ఆగస్ట్ 21 నుంచి రెండు టెస్ట్ల సిరీస్ ప్రారంభం కానుంది. రావల్పిండి వేదికగా ఆగస్ట్ 21 నుంచి 25 వరకు తొలి టెస్ట్.. కరాచీ వేదికగా ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు రెండో టెస్ట్ జరగనుంది.

రెండో టెస్ట్ జరిగే కరాచీలో కనిష్ట టికెట్ ధరను రోజుకు పాక్ రూ.50గా నిర్ణయించింది. భారత కరెన్సీలో దీని విలువ రూ. 15 మాత్రమే. టికెట్లను ఇంత తక్కువ ధరకు విక్రయించడం గత 10 ఏళ్లలో ఇదే తొలిసారి. టికెట్లు తగ్గించినందుకైన ఫ్యాన్స్ వస్తారో లేదో చూడాలి. టికెట్ల ధరలకు సంబంధించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనను విడుదల చేసింది. తొలి టెస్ట్కు ధరలను యధావిధిగా ఉంచిన పీసీబీ.. రెండో టెస్ట్ మ్యాచ్ ధరలను మాత్రం బాగా తగ్గించింది.

వీఐపీ టికెట్ ధర రోజుకు రూ. 400గా(పాకిస్థాన్ రూపాయి) .. ప్రీమియం రూ. 200, ఫస్ట్ క్లాస్ రూ. 100, జనరల్ రూ. 50గా పేర్కొంది. రావల్పిండి వేదికగా జరిగే తొలి టెస్ట్ కనిష్ట టికెట్ ధర మాత్రం రూ.200గా ఉంది. భారత కరెన్సీలో దీని విలువ రూ. 60.30. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025లో భాగంగా ఈ సిరీస్ జరగనుండగా.. ఇప్పటికే బంగ్లాదేశ్ జట్టు పాకిస్థాన్కు చేరుకుంది.