సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన పాకిస్థాన్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఈ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్కు కారణమైన పాకిస్థాన్, బంగ్లాదేశ్లపై అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కఠిన చర్యలు తీసుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 పాయింట్స్ టేబుల్లో పాయింట్ల కోత విధించింది.
నిర్ణీత సమయం కన్నా 6 ఓవర్లు తక్కువ వేసిన పాకిస్థాన్ ఖాతాలో 6 పాయింట్స్ కోత విధించిన ఐసీసీ.. 3 ఓవర్లు తక్కువ వేసిన బంగ్లాదేశ్కు మూడు పాయింట్స్ తగ్గించింది. పాకిస్థాన్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 30 శాతం, బంగ్లాదేశ్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. ఇరు జట్ల కెప్టెన్లు షాన్ మసూద్, నజ్ముల్ హుస్సెన్ షాంటో తమ తప్పిదాలను అంగీకరించడంతో తదుపరి విచారణ లేకుండానే ఐసీసీ చర్యలు తీసుకుంది.

ఐసీసీ జరిమానాతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో పాకిస్థాన్ 8వ స్థానానికి పడిపోగా.. బంగ్లాదేశ్ ఏడో స్థానంలో నిలిచింది. మైదానంలో అభ్యంతరకరంగా ప్రవర్తించిన బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ షకీబ్ అల్ హసన్పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంది. ఆర్టికల్ 2.9 ప్రకారం.. సహచర ఆటగాళ్ల పట్ల అనుచితం ప్రవర్తించిన కారణంగా మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది.
రెండో ఇన్నింగ్స్లో పాకిస్థాన్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్పై షకీబ్ అల్ హసన్ బంతి విసిరేసాడు. ఉద్దేశపూర్వకంగానే అతనిపై బంతి విసిరేసాడని గుర్తించిన ఐసీసీ అతనిపై చర్యలు తీసుకుంది. రావల్పిండి వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో పాకిస్థాన్పై బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ను 448/6 డిక్లేర్ చేసింది. మహ్మద్ రిజ్వాన్ (171*), సౌద్ షకీల్ (141) సెంచరీలతో సత్తాచాటారు. షోరిఫుల్, హసన్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 565 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముష్ఫికర్ రహీమ్ (191) తృటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. శద్మాన్ ఇస్లామ్ (93), మెహదీ హసన్ (77) రాణించారు.
నసీమ్ షా మూడు, షాహీన్ అఫ్రిది, షాజాద్, మహ్మద్ అలీ తలో రెండు వికెట్లు తీశారు. కాగా, 117 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్లో 146 పరుగులకే ఆలౌటైంది. మహ్మద్ రిజ్వాన్ (51; 80 బంతుల్లో, 6 ఫోర్లు) టాప్ స్కోరర్. ఓపెనర్ షఫికీ (37), బాబర్ అజామ్ (22) ఫర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. మెహదీ హసన్ నాలుగు, షకిబ్ అల్ హసన్ మూడు వికెట్లతో చెలరేగారు.
అనంతరం 30 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు జకీర్ హసన్ (15 నాటౌట్; 26 బంతుల్లో, 3 ఫోర్లు), షద్మాన్ (9 నాటౌట్; 13 బంతుల్లో, 1 ఫోర్) జట్టును విజయతీరాలకు చేర్చారు.