అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్థాన్ టీమ్ ప్రదర్శన రోజు రోజుకి దిగజారడంపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ షాకయ్యాడు. సొంతగడ్డపై రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్తో ఆదివారం ముగిసిన తొలి టెస్ట్లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే పాకిస్థాన్ను ఓడించడం బంగ్లాదేశ్కు ఇదే తొలిసారి.
14 టెస్ట్ మ్యాచ్ల తర్వాత బంగ్లా టైగర్స్.. పాకిస్థాన్పై చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఈ ఓటమి పాకిస్థాన్ అభిమానులతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని షాక్ గురి చేసింది. ఈ ఫలితంపై నోరెళ్లబెట్టిన కెవిన్ పీటర్సన్.. 'ఏమైందిరా మీకు'అంటూ సోషల్ మీడియా వేదికగా పాక్ ఆటగాళ్ల ప్రదర్శనపై విమర్శలు గుప్పించాడు.

'పాకిస్థాన్ క్రికెట్లో ఏం జరుగుతోంది? నేను పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడే సమయంలో ఆ టోర్నీ ప్రమాణాలు అద్భుతంగా ఉండేవి. పాకిస్థాన్ ప్లేయర్లు అద్భుతంగా ఆడేవారు. కుర్రాళ్లలో మ్యాజిక్ ఉండేది. అలాంటి పాకిస్థాన్ క్రికెట్కు ఏమైంది?'అని ఎక్స్ వేదికగా పీటర్సన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
బంగ్లా అసాధారణ పోరాటం..
డ్రా దిశగా సాగిన ఈ మ్యాచ్ను అసాధారణ పోరాటంతో బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ను 448/6 డిక్లేర్ చేసింది. మహ్మద్ రిజ్వాన్ (171*), సౌద్ షకీల్ (141) సెంచరీలతో సత్తాచాటారు. షోరిఫుల్, హసన్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 565 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముష్ఫికర్ రహీమ్ (191) తృటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. శద్మాన్ ఇస్లామ్ (93), మెహదీ హసన్ (77) రాణించారు.
నసీమ్ షా మూడు, షాహీన్ అఫ్రిది, షాజాద్, మహ్మద్ అలీ తలో రెండు వికెట్లు తీశారు. కాగా, 117 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్లో 146 పరుగులకే ఆలౌటైంది. మహ్మద్ రిజ్వాన్ (51; 80 బంతుల్లో, 6 ఫోర్లు) టాప్ స్కోరర్. ఓపెనర్ షఫికీ (37), బాబర్ అజామ్ (22) ఫర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. మెహదీ హసన్ నాలుగు, షకిబ్ అల్ హసన్ మూడు వికెట్లతో చెలరేగారు.
అనంతరం 30 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు జకీర్ హసన్ (15 నాటౌట్; 26 బంతుల్లో, 3 ఫోర్లు), షద్మాన్ (9 నాటౌట్; 13 బంతుల్లో, 1 ఫోర్) జట్టును విజయతీరాలకు చేర్చారు.