
కరాచీ: ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. పాకిస్థాన్ పర్యటనలో భాగంగా ఆ జట్టుతో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో స్మిత్(59) హాఫ్ సెంచరీతో రాణించాడు. దాంతో టెస్టుల్లో 150 ఇన్నింగ్స్ల్లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్ స్మిత్ రికార్డుకెక్కాడు. పాక్తో జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ స్మిత్కు 150వ ఇన్నింగ్స్. టెస్టు కెరీర్లో మొత్తం 7,993 పరుగులకు చేశాడు. దీంతో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర, టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ను స్మిత్ అధిగమించాడు.
సంగక్కర 150 ఇన్నింగ్స్ల్లో 7,913 పరుగులు చేయగా.. సచిన్ 7,869 పరుగులు చేశాడు. వీరి తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ (7,694), రాహుల్ ద్రవిడ్ (7,680) ఉన్నారు. పాక్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో స్టీవ్ స్మిత్ వరుసగా మూడో అర్ధశతకం సాధించాడు. రావల్పిండి మ్యాచ్లో (78), కరాచీ టెస్టులో (72) రాణించిన స్మిత్.. ప్రస్తుతం జరుగుతున్న లాహోర్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 59 పరుగులు చేశాడు.
మొదటి ఇన్నింగ్స్లో ఆసీస్ 391 పరుగులకు ఆలౌటైంది. స్మిత్తో పాటు ఖవాజా (91), గ్రీన్ (79), అలెక్స్ క్యారీ (67) హఫ్ సెంచరీలు సాధించారు. పాక్ బౌలర్లు షహీన్ అఫ్రిది (4/79), నసీమ్ షా (4/48) చెలరేగారు. 320/5 స్కోర్తో పటిష్టంగా కనిపించిన ఆసీస్.. పాక్ బౌలర్ల ధాటికీ 71 పరుగులకే చివరి 5 వికెట్లు చేజార్చుకుంది.
ఇక పాకిస్థాన్ రెండో రోజు ఆట ముగిసేసమయానికి వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది. క్రీజ్లో అబ్దుల్లా షఫీఖ్ (45 బ్యాటింగ్), అజహర్ అలీ (30 బ్యాటింగ్) ఉన్నారు. ఇమామ్ ఉల్ హక్ 11 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆసీస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ ఒక వికెట్ తీసుకున్నాడు. పాక్ ఇంకా 301 పరుగులు వెనుకబడి ఉంది.