
దుబాయ్: టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ నిష్క్రమణకు కారణమైన హసన్ అలీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గురవారం జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియా అద్భుతం చేసింది. ఓటమి అంచుల నుంచి తేరుకొని.. పాకిస్థాన్ మైండ్ బ్లాంక్ చేస్తూ టీ20 ప్రపంచకప్లో ఫైనల్కు దూసుకెళ్లింది. గెలుపు ఖాయం అనుకున్న సమయంలో పట్టు విడిచి మాథ్యూ వేడ్ ఇచ్చిన కీలక క్యాచ్ను హసన్ అలీ చేజార్చడంతో పాక్ ఇంటిదారిపట్టింది. అచ్చం న్యూజిలాండ్-ఇంగ్లండ్ సెమీస్ను తలపిస్తూ సాగిన పోరులో కివీస్ మాదిరిగానే ఆసీస్ మయా చేసింది. మాథ్యూ వేడ్(17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 41 నాటౌట్), మార్కస్ స్టోయినీస్(31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 నాటౌట్) వీరిచిత బ్యాటింగ్తో ఆసీస్ 5 వికెట్ల తేడాతో పాక్ను ఓడించింది.
అయితే మాథ్యూ వేడ్కు ధాటిగా ఆడటానికి కారణం కూడా హసన్ అలీనే. కీలక మ్యాచ్లో హసన్ అలీ ఆడిన తొండాటను ఎవరూ పెద్దగా గుర్తించలేదు. అవును.. అతను క్రీడాస్పూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తూ చేసిన పని ఆస్ట్రేలియాకు మేలు చేసింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. కానీ డేవిడ్ వార్నర్ ధాటిగా ఆడుతూ జట్టును రేసులో నిలిపాడు. అతను జట్టు స్కోరు 89 పరుగుల వద్ద నిష్క్రమించాడు. ఇంకో 7 పరుగులకే హార్డ్ హిట్టర్ మ్యాక్స్వెల్ చేతులెత్తేశాడు. వందలోపే ప్రధాన బ్యాట్స్మెన్ అందరూ పెవిలియన్లో ప్రేక్షకులయ్యారు. స్టొయినిస్, మ్యాథ్యూ వేడ్ తర్వాత బ్యాట్స్మెనే లేడు. ఆసీస్ గెలుస్తుందన్న ఆశ కూడా లేదు. పాకిస్థాన్ బౌలింగ్ పట్టు బిగించిన వేళ... అంతో ఇంతో స్టొయినిస్ పోరాడుతున్నాడు... కానీ వేడ్ 13 ఓవర్లో క్రీజులోకి వచచ్చినా... 17 ఓవర్లు ముగిసినా పది పరుగులైనా చేయలేదు. అప్పటికి అతని స్కోరు 8! ఆసీస్ గెలవాలంటే 18 బంతుల్లో 37 పరుగులు చేయాలి. ఇక్కడే హసన్ అలీ చేసిన తప్పిదం ఆసీస్కు కలిసొచ్చింది.
18వ ఓవర్ బౌలింగ్ చేసిన అతను ఓ సిక్స్, ఫోర్తో 15 పరుగులిచ్చాడు. అయితే ఈ ఓవర్ ఫస్ట్ బాల్కు మార్కస్ స్టోయినిస్ క్విక్ డబుల్ తీసి స్ట్రైకింగ్ తీసుకునే ప్రయత్నం చేశాడు. కానీ హసన్ అలీ తన తొండాటతో అతన్ని అడ్డుకున్నాడు. కావాలనే అతను రెండో పరుగు తీయకుండా అడ్డు వచ్చాడు. అతని చర్యపట్ల స్టోయినిస్ అసహనం కూడా వ్యక్తం చేశాడు. స్టోయినిస్ను నాన్ స్ట్రైకింగ్లో ఉంచితే కట్టడి చేయవచ్చని భావించిన హసన్ అలీ ఈ పనిచేసినట్లు అర్థమైంది. అంతగా టచ్లో లేని మాథ్యూ వేడ్ను బౌండరీలు కొట్టకుండా అడ్డుకోవచ్చని హసన్ అలీ భావించాడు. కానీ ఆ ఓవర్లో సిక్స్, ఫోర్ బాదిన మాథ్యూ వేడ్ టచ్లోకి వచ్చాడు. షాహిన్ అఫ్రిది 19వ ఓవర్లో మూడో బంతికి క్యాచ్ మిస్ కావడంతో వేడ్ బతికిపోయాడు. 2 పరుగులు తీసి తనే స్ట్రయిక్ తీసుకున్నాడు. ఆ తర్వాత వరుసగా 6, 6, 6 బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. దాంతో పాక్ పోరాటం ముగిసింది.