
లాహోర్: 24 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియా సిరీస్ విజయాన్నందుకుంది. సొంతగడ్డపై మూడు టెస్ట్ల సిరీస్లో పాకిస్థాన్ను మట్టికరిపించి 1-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఆద్యాంతం రసవత్తరంగా సాగిన మూడో టెస్ట్లో ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఆసీస్ 115 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తొలి రెండు టెస్ట్లు ఫలితం లేకుండా ముగియడంతో సిరీస్ ఆసీస్ సొంతమైంది. 8 వికెట్లతో చెలరేగిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (5/56, 3/23)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా.. సిరీస్లో సెంచరీల మోత మోగించిన ఉస్మాన్ ఖవాజా(496)కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వరించింది.
351 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్లో 235 పరుగులకే కుప్పకూలింది. 73/0 ఓవర్నైట్ స్కోర్తో చివరి రోజు ఆటను ప్రారంభించిన ఆ జట్టు.. ఆదిలోనే ఓపెనర్ అబ్దుల్ షఫీక్(27) వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన అజార్ అలీ(17) లయన్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. అంపైర్లు తొలుత నాటౌట్ ఇచ్చినప్పటికీ కమిన్స్ సమీక్ష కోరి ఫలితం సాధించాడు. రిప్లేలో బంతి బ్యాట్కు తగిలినట్లు స్నీకో మీటర్ చూపించింది.
ఆ వెంటనే హాఫ్ సెంచరీ హీరో ఇమామ్ ఉల్ హక్(70)ను లయన్ క్యాచ్ ఔట్ చేశాడు. ఫవాద్ అలామ్(11), మహమ్మద్ రిజ్వాన్(0) వరుసగా ఔటయ్యారు. ఈ పరిస్థితుల్లో బాబర్ ఆజామ్(55) పోరాడినా అతన్ని లయన్ ఔట్ చేసి కోలుకోలేని దెబ్బతీసాడు. సాజిద్ ఖాన్(21), హసన్ అలీ(13), షాహిన్ షా అఫ్రిది(5), నసీమ్ షా(1) వరుసగా ఔటయ్యారు. ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 391 పరుగులకు ఆలౌటైంది. అనంతరం పాకిస్థాన్ 235 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 227/3 స్కోర్ వద్ద డిక్లెర్ ఇచ్చింది.