PAK vs AFG: పాకిస్థాన్ ఆటగాళ్ల ఫిట్నెస్పై ఆ జట్టు మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ ఆటగాళ్ల ఫీల్డింగ్ చూస్తుంటే.. ఒక్కో ప్లేయర్ 8 కిలోల మటన్ తింటున్నట్లు అనిపిస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా అఫ్గానిస్థాన్తో సోమవారం జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో చిత్తయ్యింది.
చెత్త ఫీల్డింగ్తో పాటు పేలవ బౌలింగ్తో 283 పరుగుల భారీ లక్ష్యాన్ని బాబర్ సేన కాపాడుకోలేకపోయింది. పాకిస్థాన్ ఘోర పరాజయంపై ఆ దేశ మాజీ ఆటగాళ్లు మండిపడుతున్నారు. ఇప్పటికే షోయబ్ అక్తర్ తమ జట్టుపై నిప్పులు చెరగగా.. వసీం అక్రమ్ ఆటగాళ్ల ఫిట్నెస్ ప్రమాణాలపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

'పాకిస్థాన్ ఓటమి చాలా ఇబ్బందికరంగా ఉంది. 280-290 పరుగుల భారీ లక్ష్యాన్ని 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించడం ఆశ్చర్యంగా ఉంది. పిచ్పై తడి ఉందా? లేదా? అనే విషయాన్ని పక్కనపెడితే పాకిస్థాన్ ఆటగాళ్ల చెత్త ఫీల్డింగ్ చూస్తుంటే వారి ఫిట్నెస్ ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అవుతోంది.
పాక్ ఆటగాళ్లకు గత రెండేళ్లుగా ఫిట్నెస్ పరీక్షలు జరపలేదనే విషయం అర్థమవుతోంది. నేను ఆటగాళ్ల పేర్లు చెబితే వారికి నచ్చదు. కానీ వాళ్లు ప్రతి రోజూ 8 కిలోల చొప్పున మటన్ తింటున్నట్టుగా కనిపిస్తోంది. పాకిస్థాన్ మాజీ హెడ్ కోచ్ మిస్బా ఉల్ హక్ ఫిట్నెస్ విషయంలో చాలా కఠినంగా ఉండేవాడు. అతను ఆటగాళ్లకు నచ్చకపోయినా జట్టు మాత్రం అద్భుతాలు చేసింది.
క్రికెట్లో ఫిట్నెస్ పరీక్షలు కచ్చితంగా ఉండాలి. వృత్తి పరంగా మీరు దేశం కోసం ఆడుతున్నారు. అందుకు ఆటగాళ్లకు జీతం కూడా ఇస్తున్నారు. నేను మిస్బా ఉల్ హక్తో కలిసి పని చేశాను. అతను కోచ్గా ఉన్నప్పుడు అతను నెలకొల్పిన ప్రమాణాలు బాగుండేవి. కానీ ఆటగాళ్లు అతన్ని అస్యహించుకున్నారు.
అయినప్పటికీ మిస్బా పనితీరు జట్టుకు మంచి చేసింది. ఇప్పుడు మనం ఏ దశకు చేరుకున్నామంటే విజయం కోసం దేవుడిని ప్రార్థించాల్సి పరిస్థితి ఏర్పడింది. అది జరిగితే బాగుండు. ఇది జరిగితే బాగుండు. మరో జట్టు ఓడిపోతే సెమీస్కు చేరుకోవచ్చని లెక్కలు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఫీల్డింగ్ అంటే ఫిట్నెస్తో ముడిపడింది. మైదానంలో ఇది స్పష్టంగా కనబడుతోంది'అని వసీం అక్రమ్ మండిపడ్డాడు.