సోషల్ మీడియా వేదికగా తనపై విమర్శలు గుప్పిస్తున్న అభిమానులపై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. డబ్బులు తీసుకున్న కుక్కలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత సీనియర్ ఆటగాళ్లపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. హర్భజన్ సింగ్ కూడా భారత జట్టు వైఫల్యంపై ఘాటుగా స్పందించాడు.
జట్టులో స్టార్ సంస్కృతికి గుడ్ బై చెప్పాలని సూచించాడు. టీమిండియా ప్రదర్శనపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన హర్భజన్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పేరు ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించిన హర్భజన్ సింగ్.. సీనియర్ బ్యాటర్లు అయిన రోహిత్ శర్మ, కోహ్లీలకు కూడా చురకలంటించాడు.

'రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్గా ఉన్నప్పుడే టీమిండియా మెరుగ్గా ఆడింది. కానీ ఆ తర్వాత ఆకస్మాత్తుగా భారత జట్టుకు ఏమైందో నాకు అర్థం కావడం లేదు. గత ఆరు నెలల్లో వరుస పరాజయాలతో జట్టు ఒక్కసారిగా పతనమైనట్లు అనిపిస్తోంది. కోహ్లీ, రోహిత్ ఎవరైనా ఆట కంటే ఎవరూ ముఖ్యం కాదు.
కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే వంటి మ్యాచ్ విన్నర్లు సైతం జట్టులో చోటు కోల్పోయారు. టీమిండియా సూపర్ స్టార్ సంస్కృతిని వదిలి పెట్టాలి. అభిమన్యు ఈశ్వరన్, సర్ఫరాజ్ ఖాన్లకు ఒక్క అవకాశం ఇవ్వలేదు. పేరున్న ఆటగాళ్లను కాకుండా బాగా ఆడే ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి.'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.
హర్భజన్ సింగ్పై కోహ్లీ, రోహిత్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. వ్యక్తి జీవితానికి సంబంధించిన విషయాలు ప్రస్తావిస్తూ జుగుప్సాకరమైన రీతిలో ట్రోలింగ్కు పాల్పడ్డారు. ఈ ట్రోలింగ్పై భజ్జీ ఘాటుగా స్పందించాడు. డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయనే సామెతను పంచుకున్నాడు. 'మార్కెట్లో ఏనుగు వెళ్తుంటే.. డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి'అని వ్యాఖ్యలను షేర్ చేశాడు.