టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు ప్రతిష్టాత్మక పద్మ శ్రీ పురస్కారం లభించింది. గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను శనివారం ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ఈసారి ఏడుగురిని పద్మ విభూషణ్, 19 మందిని పద్మ భూషణ్, 113 మందిని పద్మశ్రీ పురస్కారాలు వరించాయి.
క్రీడల విభాగం నుంచి అశ్విన్తో పాటు హాకీ దిగ్గజ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్, పారా ఆర్చరీ అథ్లెట్ హర్విందర్ సింగ్, ఫుట్బాల్ స్టార్ మని విజయన్, పార అథ్లెటిక్ కోచ్ సత్యపాల్ సింగ్లను ఈ ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి. పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత పురుషుల హాకీ టీమ్ బ్రాంజ్ మెడల్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన పీఆర్ శ్రీజేష్కు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించింది.

పారిస్ ఒలింపిక్స్లో గ్రేట్ బ్రిటన్తో జరిగిన మ్యాచ్లో షూటౌట్లో గోల్ కీపర్గా శ్రీజేష్ అద్భుత ప్రదర్శన కనబర్చి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. పారిస్ ఒలింపిక్స్ అనంతరం అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలికిన అతను ప్రస్తుతం పురుషుల జూనియర్ టీమ్ హెడ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
రవిచంద్రన్ అశ్విన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే అతను రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
అశ్విన్ 106 టెస్ట్లు ఆడి 537 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా కొనసాగుతున్నాడు.
భారత ఆల్టైమ్ గ్రెటేస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ విజయన్కు పద్మ శ్రీ అవార్డు దక్కింది. కేరళకు చెందిన విజయ్ ఫార్వార్డ్ ప్లేయర్గా భారత ఫుట్బాల్ కెప్టెన్గా వ్యవహరించారు. 72 అంతర్జాతీయ మ్యాచ్ల్లో 29 గోల్స్ నమోదు చేశారు.
క్రీడల విభాగం పద్మ అవార్డ్స్ లిస్ట్:
పీఆర్ శ్రీజేష్-కేరళ (హాకీ) పద్మ భూషణ్
హర్విందర్ సింగ్ - హర్యానా (పారా ఆర్చరీ) పద్మశ్రీ
రవిచంద్రన్ అశ్విన్ - తమిళనాడు (క్రికెట్) పద్మశ్రీ
మని విజయన్- కేరళ (ఫుట్బాల్) పద్మశ్రీ
సత్యపాల్ సింగ్- (ఉత్తరప్రదేశ్) పద్మశ్రీ