ఇంగ్లండ్ పర్యటనను ముగించుకొని హైదరాబాద్కు చేరుకున్న టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్కు ఘనస్వాగతం లభించింది. బుధవారం హైదరాబాద్కు చేరుకున్న సిరాజ్కు శంషాబాద్ విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారీ ఎత్తున విమానాశ్రయానికి చేరుకున్న అభిమానులు.. సిరాజ్ భాయ్ సిరాజ్ భాయ్ అని గట్టిగా అరుస్తూ వెల్కమ్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో సిరాజ్.. 185.3 ఓవర్లు వేసి 23 వికెట్లతో సత్తా చాటాడు. ఓవల్ వేదికగా ఐదు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఆఖరి పోరులో మహమ్మద్ సిరాజ్(5/104) అద్వితీయమైన బౌలింగ్తో టీమిండియాను గెలిపించాడు.

374 పరుగుల లక్ష్యచేధనలో 339/6 ఓవర్నైట్ స్కోర్తో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. సిరాజ్ ధాటికి 367 పరుగులకు ఆలౌటైంది. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులే అవసరమవ్వగా.. సిరాజ్ సంచలన ప్రదర్శనతో జెమీ స్మిత్, జెమీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్లను పెవిలియన్ చేర్చాడు. ఈ మ్యాచ్లో మొత్తం 9 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ ప్రదర్శనతోనే ఐసీసీ ర్యాంకింగ్స్లో కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు.
మహమ్మద్ సిరాజ్కు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే యోచనలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఉంది. ఈ విషయాన్ని హెచ్సీఏ ప్రతినిధులు మీడియాకు తెలిపారు. 'మేం ఇంకా సిరాజ్తో మాట్లాడలేదు. కానీ మేం అతని కోసం సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. అతను మరికొద్ది రోజులు హైదరాబాద్లోనే ఉండే అవకాశం ఉంది. ఇంగ్లండ్ పర్యటనలో దేశం తరఫున మెరుగైన ప్రదర్శన చేయడం మా అందరికీ గర్వకారణం'అని హెచ్సీఏ ప్రతనిధులు తెలిపారు.