భారత సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్.. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) 2025పై తీవ్ర ప్రభావం చూపనుంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు పాకిస్థాన్తో పాటు పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్(పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో సుమారు 80 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
పహల్గాంలో భారత స్త్రీల సింధూరాన్ని నేల రాల్చిన వారి మీద ప్రతీకార చర్యగా 'ఆపరేషన్ సింధూర్'అని ఈ సైనిక చర్యకు నామకరణం చేశారు. ఈ ఆపరేషన్ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాయాదీ దేశాల మధ్య యుద్దం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విదేశీ ఆటగాళ్లు ఇంటికి..
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న పీఎస్ఎల్ 2025 నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆపరేషన్ సింధూర్ కారణంగా పాకిస్థాన్లో భద్రతాపరమైన ఆందోళనలు నెలకొన్నాయి. పీఎస్ఎల్ ఆడేందుకు వచ్చిన విదేశీ ఆటగాళ్లు తీవ్ర ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. ఈ ఉద్రిక్తల నేపథ్యంలో వారు పాకిస్థాన్ను విడిచి స్వదేశానికి తిరుగు పయనం కావచ్చు. పీఎస్ఎల్ మ్యాచ్ల ప్రసారంపై కూడా తీవ్ర ప్రభావం ఉండవచ్చు. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి తర్వాత పీఎస్ఎల్ ప్రసారాలను భారత్లో నిలిపి వేసారు. భారత సైనిక చర్య కారణంగా పాకిస్థాన్లోనూ పీఎస్ఎల్ ప్రసారాలకు అంతరాయం ఏర్పడవచ్చు. అదే జరిగితే పీఎస్ఎల్ బ్రాడ్కాస్టర్స్ తీవ్రంగా నష్టపోతారు.
యుద్దం జరిగితే..?
ఇరు దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొంటే.. లీగ్ను రద్దు చేయడం లేదా వాయిదా వేసే అవకాశం ఉంది. భారత సరిహద్దుల్లో ఉన్న వేదికల నుంచి మ్యాచ్లను తరలించవచ్చు. ప్రస్తుతం రావల్పిండి వేదికగా పీఎస్ఎల్ మ్యాచ్లు జరగుతున్నాయి. ఇది భారత సరిహద్దుకు దగ్గరగా ఉండటం పీఎస్ఎల్ నిర్వాహకులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ రోజు(బుధవారం) ఇస్లామాబాద్ యునైటెడ్, క్వెట్టా గ్లాడియేటర్స్ మధ్య రావల్పిండి వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉంది. భద్రతా పరిస్థితిని బట్టి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పీఎస్ఎల్పై తుది నిర్ణయం తీసుకోనుంది.
షెడ్యూల్ ప్రకారమే..
భారత్, పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో పీఎస్ఎల్ 2025 షెడ్యూల్ ప్రకారం కొనసాగుతోందని పీసీబీ అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేసింది. టోర్నీ రద్దు చేయడం లేదా వాయిదా వేసే ఆలోచన లేదని స్పష్టం చేసింది. 'భారత్ దాడుల నేపథ్యంలో అన్ని మ్యాచ్ల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాం. ఆటగాళ్లు, అధికారులు, ప్రేక్షకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. షెడ్యూల్ ప్రకారమే పీఎస్ఎల్ కొనసాగుతుంది'అని పీసీబీ తమ ప్రకటనలో పేర్కొంది. నేటి మ్యాచ్ కూడా షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేసింది.