భారత త్రివిధ దళాలు చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఆదివారం ధర్మశాల వేదికగా జరగనున్న మ్యాచ్ను అహ్మదాబాద్ వేదికకు తరలించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనను విడుదల చేశారు. 'పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ధర్మశాల వేదికగా జరగాల్సిన 61వ ఐపీఎల్ 2025 మ్యాచ్ను అహ్మదాబాద్కు తరలించాం. విమానాశ్రయాల మూసివేతతో ఈ నిర్ణయం తీసుకున్నాం.’అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ రోజు మధ్యహ్నమే మ్యాచ్ తరలింపు వార్తలు వచ్చాయి. వీటిని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ అనిల్ పటేల్ ధృవీకరించాడు. ముంబై-పంజాబ్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా మధ్యాహ్నం జరుగుతుందని చెప్పాడు. 'పంజాబ్-ముంబై మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వాలని బీసీసీఐ మమ్మల్ని కోరింది. ముంబై ఈ రోజు సాయంత్రానికి ఇక్కడికి చేరుకోనుంది. పంజాబ్ కింగ్స్ రావడం గురించి త్వరలోనే తెలియనుంది.'అని అనిల్ పటేల్ పేర్కొన్నాడు.

ఉగ్రదాడికి ప్రతీకారంగా..
జమ్మూ కశ్మీర్లో గత నెల 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతికారంగా భారత త్రివిధ దళాలు మంగళవారం ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్థాన్లోని ఉగ్రవాదుల శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో సుమారు 80 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తోంది. పహల్గాంలో భారత స్త్రీల సింధూరాన్ని నేల రాల్చిన వారి మీద ప్రతీకార చర్యగా 'ఆపరేషన్ సిందూర్'అని ఈ దాడికి నామకరణం చేశారు. అయితే ఈ ఆపరేషన్ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాయాదీ దేశాల మధ్య యుద్దం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విమానాశ్రయాల మూసివేత..
ఈ పరిస్థితులు ఐపీఎల్ 2025 సీజన్ నిర్వహణపై ప్రభావం చూపుతాయా? అనే ప్రశ్నలు తలెత్తాయి. ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారమే యాథావిధిగా కొనసాగుతుందని, ఆపరేషన్ సింధూర్ ప్రభావం మ్యాచ్లపై పడదని ఇప్పటికే బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్థాన్ సరిహద్దులకు సమీపంగా ఉండే 18 విమానాశ్రయాలను భారత ప్రభుత్వం తాత్కలికంగా మూసి వేసింది. ఇందులో ధర్మశాలతో పాటు ఛండీఘడ్, అమృత్ సర్, జమ్మూ, శ్రీనగర్ కూడా ఉన్నాయి. ఈ నిర్ణయంతో ధర్మశాల వేదికగా జరిగే మ్యాచ్ల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.
పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి ధర్మశాల మైదానం రెండో హౌమ్ గ్రౌండ్గా ఉంది. ఇప్పటికే ఇక్కడ ఒక మ్యాచ్ జరిగింది. నేడు పంజాబ్-ఢిల్లీ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఆపరేషన్ సిందూర్కు ముందే ఈ రెండు జట్లు అక్కడికి చేరుకున్నాయి. కాబట్టి ఈ మ్యాచ్కు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఆదివారం జరిగే మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ ఇక్కడికి రావడం సమస్యగా మారింది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ను అహ్మదాబాద్కు తరలించినట్లు బీసీసీఐ తెలిపింది. పంజాబ్, ఢిల్లీ ఆటగాళ్లను ప్రత్యేక విమానంలో ధర్మశాల నుంచి తరలించే అవకాశం ఉంది.