టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఆగ్రహం వ్యక్తం చేశాడు. ధావన్ ఓ కుళ్లిన గుడ్డు లాంటోడని పేరు ప్రస్తావించకుండా పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ ఛాంపియన్స్ లీగ్(డబ్ల్యూసీఎల్) 2025లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ ఛాంపియన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ఆఖరి నిమిషంలో రద్దయిన విషయం తెలిసిందే. పాకిస్థాన్తో ఆడేందుకు శిఖర్ ధావన్తో సహా భారత ఆటగాళ్లు నిరాకరించడంతో ఈ మ్యాచ్ను నిర్వాహకులు రద్దు చేశారు. అభిమానులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పారు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఈ టోర్నీని నిర్వహిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ సహయజమానిగా ఉన్నాడు.
చివరి నిమిషంలో మ్యాచ్ను రద్దు చేయడంపై పాక్ ఛాంపియన్స్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది అసంతృప్తి వ్యక్తం చేశాడు. రాజకీయాలకు క్రీడలను దూరంగా ఉంచాలని కోరాడు. తన వల్లే ఈ మ్యాచ్ రద్దు అయిందంటే.. ఈ టోర్నీకి దూరంగా ఉండేవాడినని తెలిపాడు. ఆట కంటే ఎవరూ గొప్ప కాదని అభిప్రాయపడ్డాడు.

'మేం క్రికెట్ ఆడటానికి ఇక్కడికి వచ్చాం. రాజకీయాలకు క్రీడలను దూరంగా ఉంచాలని నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను. ఒక ఆటగాడు మంచి అంబాసిడర్గా ఉండాలి తప్ప, దేశానికి ఇబ్బంది కలిగించ కూడదు. భారత్కు మాతో ఆడాలనుకుంటే.. ముందే ఈ విషయం చెప్పాల్సింది. ఇక్కడికి వచ్చి.. ప్రాక్టీస్ సెషన్స్ కూడా నిర్వహించి, సరిగ్గా మ్యాచ్కు ముందు ఆడమని చెప్పడం సరికాదు.
భారత జట్టులో ఒక ఆటగాడు కుళ్లిన గుడ్డుగా తయారయ్యాడు. కుళ్లిన గుడ్డు మిగతా గుడ్లను కూడా పాడు చేస్తోంది. సదరు ఆటగాడు కూడా జట్టు మొత్తాన్ని ప్రభావితం చేశాడు. ఇతర ఆటగాళ్లు మ్యాచ్ ఆడకుండా చెడగొట్టాడు. నా వల్లే మ్యాచ్ ఆగిపోతుందని తెలిసి ఉంటే.. నేను ఇక్కడికి వచ్చేవాడిని కూడా కాదు. క్రికెట్ ముందు ఎవరూ గొప్ప కాదు. ఆటకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
క్రికెట్ అన్నిటికంటే గొప్పది. ఆటలు ప్రజలను దగ్గర చేస్తాయి. కానీ రాజకీయాలను అన్నింటిలోనూ భాగం చేస్తే ముందుకు సాగడం ఎలా? కలిసి కూర్చోని చర్చించుకునే వరకు ఏదీ మెరుగుపడదు. సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. మ్యాచ్ రద్దు అయినందున రూల్స్ ప్రకారం మాకే రెండు పాయింట్స్ లభిస్తాయి.'అని అఫ్రిది చెప్పుకొచ్చాడు. జూలై 18న ప్రారంభమైన ఈ టోర్నీ ఆగస్ట్ 2న జరిగే ఫైనల్తో ముగియనుంది.