కిక్కిరిసిన మైదానం..
మొహాలీ మైదానం వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూడటానికి ఇరు దేశాల ప్రధానులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అప్పటి భారత ప్రధాని మన్మోహన్సింగ్ ఆహ్వానం మేరకు పాక్ ప్రధానిగా ఉన్న యూసుఫ్ రజా గిలానీ ప్రత్యేకంగా మొహాలీకి వచ్చి మరీ మ్యాచ్ను తిలకించారు. అలాగే పాక్ నుంచి కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చాలావరకు టికెట్లు బ్లాక్లో అమ్ముడుపోయాయి. కీలకమైన పోరును ప్రత్యక్షంగా చూసేందుకు నిర్ణీత ధరకన్నా మూడింతలు ఎక్కువే పెట్టి అభిమానులు కొనుగోలు చేశారు. దాంతో స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది.

శుభారంభం..
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయగా.. ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్( 25 బంతుల్లో 9 ఫోర్లతో 38), సచిన్ టెండూల్కర్ (115 బంతుల్లో 11 ఫోర్లతో 85) మంచి శుభారంభాన్ని అందించారు. ఫస్ట్ వికెట్కు 48 పరుగులు జోడించిన అనంతరం సెహ్వాగ్ ఔటవ్వడంతో.. గంభీర్(27)తో కలిసి సచిన్ ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నాడు. రెండో వికెట్కు వీరిద్దరూ 68 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే గంభీర్, కోహ్లీ(9), యువరాజ్(0) స్వల్ప వ్యవధిలో ఔటవ్వడంతో భారత్ 141 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆదుకున్న సచిన్..
ఈ పరిస్థితుల్లో జట్టును సచిన్ ఆదుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు సచిన్ ఒంటరిపోరాటం చేశాడు. ధోనీ(25)తో కలిసి ఐదో వికెట్కు 46 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించాడు. అయితే సెంచరీకి చేరువ అవుతున్న వేళ అజ్మల్ బౌలింగ్లో అఫ్రిదికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.పలుమార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మాస్టర్కు ఈ సారి మాత్రం ఆ అవకాశం దక్కలేదు. జట్టు స్కోర్ 187 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. అందులో సచిన్ చేసినవే 85 పరుగులున్నాయి. ఇక జట్టు స్కోర్ 200 దాటాక ధోనీ సైతం వెనుదిరిగాడు. చివర్లో రైనా(36 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో భారత్ 260 పరుగులు చేయగలిగింది.

చెలరేగిన బౌలర్లు..
మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్న పాకిస్థాన్కు ఈ టార్గెట్ ఏమాత్రం సరిపోదనిపించింది. కానీ భారత బౌలర్లు చెలరేగడంతో వరుసగా వికెట్లు కోల్పోయిన పాక్ 49.5 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. పాక్ జట్టులో మహ్మద్ హఫీజ్(43), మిస్బా ఉల్ హక్(56) రాణించారు. అలా ఫైనల్కు చేరి అక్కడ శ్రీలంకను చిత్తుచేసింది. ఈ నేపథ్యంలోనే ధోనీసేన 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రెండోసారి వన్డే ప్రపంచకప్ను ముద్దాడింది. ఏదేమైనా ఈ మ్యాచ్లో సచిన్ ఒంటరిపోరాటానికి తోడు భారత బౌలర్లు సమష్టిగా రాణించడం అభిమానులకు ఎప్పటికీ తీపి జ్ఞాపకమే.


Click it and Unblock the Notifications
