ఫిబ్రవరి 24 క్రికెట్ చరిత్రలోనే మరిచిపోలేని రోజు. సరిగ్గా 14 ఏళ్ల క్రితం టీమిండియా దిగ్గజ ఆటగాడు, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అత్యంత అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అసాధ్యమనుకున్న ఘనతను సుసాధ్యం చేశాడు. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ నమోదు చేశాడు.
24 ఫిబ్రవరి 2010న సౌతాఫ్రికాతో గ్వాలియర్ వేదికగా జరిగిన మ్యాచ్లో డబుల్ సెంచరీ చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అది కూడా రిటైర్మెంట్కు దగ్గరైన 37 ఏళ్ల వయసులో ఈ వరల్డ్ రికార్డ్ అందుకున్నాడు.

డేల్ స్టెయిన్, వేన్ పార్నెల్, జాక్విస్ కలిస్ వంటి స్టార్ బౌలర్లను ఎదుర్కొని 147 బంతుల్లోనే ద్విశతకాన్ని అందుకున్నాడు. సచిన్ తన ఇన్నింగ్స్లో 25 బౌండరీలతో పాటు మూడు సిక్సర్లు కొట్టాడు. భారత ఇన్సింగ్ చివరి ఓవర్ మూడో బంతికి సచిన్ 200 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. చార్ల్ లాంగ్వెల్ట్ వేసిన ఆ బంతికి సచిన్ సింగిల్ తీసి వన్డే క్రికెట్లో తొలి ద్విశతకాన్ని నమోదు చేశాడు.
సచిన్ డబుల్ సెంచరీ చేసిన తర్వాత వన్డేల్లో ఏడుసార్లు ద్విశతకాలు నమోదయ్యాయి. ఈ జాబితాలో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ కూడా ఉన్నారు. సెహ్వాగ్ ఒక్కసారి డబుల్ బాదగా.. రోహిత్ మూడు సార్లు ఆ ఘనత సాధించారు. ఇక విండీస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్గేల్, న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్, పాకిస్థాన్ ఓపెనర్ ఫకర్ జమాన్లు ద్విశతకాన్ని అందుకున్నారు.
కాకతాళీయమో ఏమో కానీ క్రిస్ గేల్ సైతం ఫిబ్రవరి 24నే డబుల్ సెంచరీ సాధించాడు. ఇక టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇదే రోజు టెస్ట్ల్లో శతకాన్ని నమోదు చేశాడు. ఈ ఘనతను అందుకున్న తొలి భారత వికెట్ కీపర్గా చరిత్రకెక్కాడు. ఈ ఘనతల నేపథ్యంలో భారత అభిమానులకు ఈ రోజు మరిచిపోలేనిది.