17 పరుగులకే సగం వికెట్లు..
38 ఏళ్ల కిత్రం ఇదే రోజు( జూన్ 18, 1983) భారత్-జింబాంబ్వే ప్రపంచకప్ మ్యాచ్. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రపంచకప్ రేసులో భారత్ నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్. బ్యాటింగ్కు దిగిన భారత్ ఖాతా తెరవకుండానే ఓపెనర్ సునీల్ గవాస్కర్ వికెట్ కోల్పోయింది. 6 పరుగులనంతరం మరో ఓపెనర్ శ్రీకాంత్ డకౌట్. అదే స్కోర్ వద్ద అమర్నాథ్(5) కూడా పెవిలియన్ బాట పట్టాడు. మరో 11 పరుగుల వ్యవధిలో టాపార్డర్ అంతా ప్యాకప్. భారత్ స్కోర్ 17/5. దీంతో ప్రపచంకప్ పోరులో మరోసారి భారత్ కథ ముగిసిందని, టీమిండియా ఆటగాళ్లతో సహా అందరూ అనుకున్నారు. ఆర్గనైజర్స్ అయితే మరో మ్యాచ్ నిర్వహించవచ్చని టాస్ ఏర్పాట్లకు సిద్ధమయ్యారు.
ఒకే ఒక్కడు.. తొలి శతక వీరుడు..
కానీ ఒకే ఒక్కడు మాత్రం చివరి బంతి వరకు పోరాడాలనుకున్నాడు. ఏది ఏమైనా తన సారథ్యంలోనే భారత్ను విశ్వవిజేతగా నిలపాలనుకున్నాడు. మరోవైపు వికెట్లు కోల్పోతున్నా.. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో పోరాడాడు. ఇతర బ్యాట్స్మన్ బంతిని బ్యాట్కు తగిలించడానికే ఇబ్బంది పడ్డ పిచ్లో అలవోక షాట్స్తో ఆకట్టుకున్నాడు.
అతనే భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్. ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 138 బంతుల్లో 16 ఫోర్లు.. 6 సిక్స్లతో 175 పరుగులతో నాటౌట్గా నిలిచి చరిత్రసృష్టించాడు. భారత్ తరఫున తొలి వన్డే సెంచరీ సాధించిన ఆటగాడిగా సువర్ణాక్షరాలతో తన పేరును లిఖించుకున్నాడు. స్కేర్వ్ ఆఫ్ ది వికెట్ మీదుగా ఎక్కువ బౌండరీలు బాదిన కపిల్.. సిక్సర్లను మాత్రం లాంగాన్ దిశగా కొట్టాడు. స్ట్రైట్డ్రైవ్ బౌండరీలు కూడా బాదాడు. కపిల్ విధ్వంసంతో భారత్ 8 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది.
అలవోక విజయం..
267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాంబ్వే సైతం భారత్ పడిన కష్టాలనే ఎదుర్కొంది. 113 పరుగులకే 6 వికెట్లు కోల్పోగా.. ఆ జట్టు ఆల్రౌండర్ కెవిన్ కుర్రాన్ (73) ఒంటరి పోరాటం చేశాడు. అతనికి మదన్లాల్ అడ్డుకట్ట వేయగా.. రిటర్న్ క్యాచ్తో చివరి వికెట్ను కపిల్ పడగొట్టడంతో జింబాంబ్వే పోరాటం ముగిసింది. భారత్ ఓడాల్సిన మ్యాచ్లో 31 పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మదన్లాల్, రోజర్ బిన్నీ ఇద్దరూ 5 వికెట్లు తీయడంతో పాటు కపిల్ ఒక వికెట్ తీశాడు. అనంతరం ఆస్ట్రేలియాతో చివరి లీగ్ మ్యాచ్ను 118 పరుగులతో గెలిచిన కపిల్సేన సగర్వంగా సెమీస్లోకి అడుగుపెట్టింది. ఇంగ్లండ్పై 6 వికెట్లతో గెలిచి ఫైనల్లో వెస్టిండీస్ను మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది.
ఆ విజయమే..
ఈ మ్యాచ్ జరిగిన 38 ఏళ్లు అయిన సందర్భంగా నాటి క్షణాలను కపిల్ ఓ ఇంటర్వ్యూలో నెమరవేసుకున్నాడు. ఆ విజయంతో ప్రపంచకప్ గెలుస్తామని నమ్మకం కలిగిందన్నాడు. '1983 ప్రపంచకప్లో జింబాబ్వే మ్యాచ్ ఎంతో కీలకమైంది. ఆ మ్యాచ్తోనే మా జట్టులో టాప్జట్లను కూడా ఓడించగలమనే నమ్మకం కలిగింది. మనదైన రోజు ఏ జట్టునైనా ఓడించగలమనే ఆత్మవిశ్వాసం లభించింది. నేను ఆడిన ఆ ప్రత్యేక ఇన్నింగ్స్.. జట్టుకు మంచి స్ఫూర్తిగా నిలిచింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. ఏ జట్టునైనా ఓడించగలమనే నమ్మకాన్ని తీసుకొచ్చింది' అని ఐసీసీ ట్వీట్ చేసిన వీడియోలో కపిల్ వెల్లడించాడు.