ఉత్కంఠకు కూడా ఊపిరి అందలేదు.. ఆ ఆటను చూసి..! అద్భుతానికి కూడా ఆలోచన తట్టలేదు నాటి పోరాటాన్ని చూసి.. అధ్యాంతం థ్రిల్లింగ్ మూవీని తలపించిన ఆ మ్యాచ్లో ఒక్కో బంతి.. ఒక్కో గుండెను తట్టిలేపింది. ఒక్కొక్క పరుగు.. భావోద్వేగాన్ని మెలివేసింది. ఒక్కో ప్రార్థన.. ఒక్కో దైవాన్ని మేలుకొలిపింది.
నాలుగున్నర దశాబ్దల కల... ఏడున్నర గంటల్లో తేలకపోయినా.. నాలుగున్నర నిమిషాల మహా సంగ్రామంలో మెరిసి మురిసింది. హృదయంతరాల్లో గూడుకట్టుకుపోయిన తీరని వేదన.. అర సెకన్లో తేలిపోయింది. మెట్టినింట నలుగురు మెచ్చిన ఆట.. పుట్టింటికి తొలి విశ్వ కానుక అందించింది.తొలిసారి జగజ్జేతగా నిలిచిన ఇంగ్లండ్.. విశ్వవిజేతల సరసన ఠీవీగా కూర్చుంది.

వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి సూపర్ ఓవర్కు దారి తీసిన నాటి ఫైనల్ మ్యాచ్కు అప్పుడే ఐదేళ్లు పూర్తి అయ్యింది. సరిగ్గా ఐదేళ్ల క్రితం(2019, జూలై 14) ఇదే రోజు యావత్ క్రికెట్ ప్రపంచానికి కనీవినీ ఎరగని రీతీలో కావాల్సిన మజా లభించింది. క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన నాటి ఫైనల్లో ఎన్నో ములపులు.. మరెన్నో భావోద్వేగాలు మిళితమయ్యాయి.
ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నాటి థ్రిల్లర్ మ్యాచ్ను స్మరించుకుంటున్నారు. కొందరు అడ్డదారిలో ఇంగ్లండ్ విజయం సాధించిందని చీదరించుకుంటున్నారు. ఇంగ్లండ్ తొండాటకు ఐదేళ్లు పూర్తయిందని కామెంట్ చేస్తున్నారు.

స్కోర్లు టై..
ఆ ఫైనల్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 241 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్.. బెన్ స్టోక్స్(84 నాటౌట్) అజేయ పోరాటంతో నిర్ణీత 50 ఓవర్లలో సరిగ్గా 241 పరుగులకే ఆలౌటైంది. దీంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్కు దారితీసింది.
ఇక సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 15 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ కూడా 15 పరుగులే చేసింది. కానీ అసంబద్దమైన బౌండరీల నిబంధన ప్రకారం ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. న్యూజిలాండ్ కంటే ఇంగ్లండ్ ఎక్కువ బౌండరీలు బాదడంతో ఆ జట్టును విజేతగా ప్రకటించారు. ఈ నిర్ణయంపై చాలా మందికి విస్మయం వ్యక్తం చేశారు.

న్యూజిలాండ్ను వెంటాడిన దురదృష్టం..
ఈ మ్యాచ్లో ఇంగ్లండ్కు అదృష్టం బాగా కలిసిరాగా.. న్యూజిలాండ్ను మాత్రం దురదృష్టం వెంటాడింది. 49 ఓవర్ బెన్ స్టోక్స్ ఇచ్చిన సునాయస క్యాచ్ను అందుకున్న ట్రెంట్ బౌల్ట్ బౌండరీ లైన్ను తొక్కడం కివీస్ కొంపముంచింది. దాంతో ఔట్ కాస్త సిక్స్గా మారింది.
ఇక చివరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. ఇంగ్లండ్ విజయానికి 4 బంతుల్లో 15 పరుగులు కావాల్సిన సమయంలో అంపైర్ల తప్పిదం ఇంగ్లండ్కు కలిసొచ్చింది. బౌల్ట్ వేసిన నాలుగో బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా స్టోక్స్ షాట్ ఆడగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మార్టిన్ గప్టిల్ బంతిని అందుకొని వికెట్లకు త్రో విసిరాడు.
అది కాస్త పరుగు పూర్తి చేసిన స్టోక్స్ బ్యాట్కు తగిలి బౌండరీకి వెళ్లింది. అప్పటికే స్టోక్స్ రెండు పరుగులు తీయడం.. బౌండరీ ద్వారా 4 రన్స్ రావడంతో అంపైర్లు 6 పరుగులని ప్రకటించారు. దీంతో విజయ సమీకరణం 2 బంతుల్లో 3 పరుగులైంది. అనంతరం ఇంగ్లండ్ బ్యాటర్లు రెండు బంతుల్లో 2 పరుగులు తీసి రనౌటయ్యారు.

తొండాటతో గెలిచారు..
ఇరు జట్లు ఆఖరి క్షణం వరకు సమఉజ్జీలుగా పోరాడి సమంగా నిలిచినా.. బౌండరీల కౌంట్ ద్వారా ఫలితాన్ని తేల్చడం చాలా మంది అభిమానులకు నచ్చలేదు. దీంతో ఈ బౌండరీల నిబంధనపై పెను దుమారం రేగింది. అలాగే బ్యాట్ తగిలి బౌండరీ వెళ్లిన దానికి 6 పరుగులు ఇవ్వడం కూడా క్రీడా స్పూర్తి విరుద్దమనే విమర్శలు వినిపించాయి.
అంతేకాకుండా నిబంధనల ప్రకారం ఐదు పరుగులే ఇవ్వాలని, అంపైర్లు ఉద్రిక్తతలను తట్టుకోలేక తప్పిదం చేశారని స్పష్టమైంది. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఐసీసీ బౌండరీల కౌంట్ నిబంధనను తొలగించింది. ఇక ఇంగ్లండ్ ప్రపంచకప్ గెలుచుకున్నా.. న్యూజిలాండ్ మాత్రం అభిమానుల మనసులను గెలుచుకుంది.
అంత జరిగినా ఎలాంటి భావోద్వేగాలను ప్రదర్శించకుండా న్యూజిలాండ్ క్రీడా స్పూర్తికి సరైన ఉదహారణగా నిలిచింది. ఇలా అనేక విమర్శలు.. భావోద్వేగాలతో థ్రిల్లింగ్ సినిమాను తలపించిన ఈ మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయింది.! అయితే తొండాటతో ప్రపంచకప్ గెలుచుకుందనే అపవాదును మాత్రం ఇంగ్లండ్ మూటగట్టుకుంది.