
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. అయితే, అతని కెరీర్లో అనితర సాధ్యమైన రికార్డు సాధించి నేటికి 9 ఏళ్లు పూర్తవుతోంది. 2012లో(మార్చి 16) ఇదే రోజున సచిన్.. 100వ సెంచరీ సాధించాడు. సెంచరీల సెంచరీ చేసి క్రికెట్ చరిత్రలో మరెవరికీ సాధ్యం కానీ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.
ఆసియా కప్లో భాగంగా బంగ్లాదేశ్పై 114 పరుగులు చేసిన ఈ ఘనతను అందుకున్నాడు. అందుకే మార్చి 16.. భారత క్రికెట్ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోయే రోజు. సచిన్కు ముందు.. సచిన్కు తర్వాత అన్న మాటను మరోసారి నిజం చేస్తూ.. ప్రతి భారత క్రికెట్ అభిమాని గర్వపడేలా .. చరిత్రను తిరగరాస్తూ మాస్టర్ సాధించిన ఆ శతకం ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ మరపురాని ఘట్టం.
ఆసియా కప్-2012లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన వన్డే మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ సెంచరీ సచిన్కు వన్డేల్లో 49వది. అలాగే అప్పటికే టెస్టుల్లో 51 సెంచరీలు చేయడం వల్ల ప్రపంచ క్రికెట్లో 100 శతకాలు బాదిన ఏకైక ఆటగాడిగా మాస్టర్ చరిత్ర సృష్టించాడు. అయితే సచిన్ సెంచరీ చేసినా కూడా ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 290 పరుగులు చేయగా.. మరో నాలుగు బంతులు మిగిలుండగానే బంగ్లాదేశ్ లక్ష్యాన్ని ఛేదించింది.
సచిన్ కెరీర్లో మొత్తం 164 అర్ధసెంచరీలు ఉన్నాయి. సచిన్ తర్వాత అత్యధిక సెంచరీల జాబితాలో 71 శతకాలతో రికీ పాంటింగ్ రెండో స్థానంలో నిలవగా.. కోహ్లీ 70 సెంచరీలతో ఉన్నాడు. తన 24 ఏళ్ల కెరీర్లో మొత్తం 34,357 పరుగులు సాధించాడు. వన్డే క్రికెట్లో తొలి డబుల్ సెంచరీ చేసిన ఆటగాడు కూడా సచినే.