
న్యూఢిల్లీ: డిసెంబర్ 23 భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రత్యేకమైన రోజు. 16 ఏళ్ల క్రితం 2004లో ఇదే రోజు ధోనీ చరిత్ర మొదలైంది. బంగ్లాదేశ్ మ్యాచ్తో మహీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. జులపాల జుట్టు.. తెల్ల ప్యాడ్లు కట్టుకొని వీడెవడ్రా.. అని అభిమానులు ఆశ్చర్యపోయే విధంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగాడు. కానీ సహచర ఆటగాడి సమన్వయ లోపంతో ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే వెనుదిరిగాడు. ఆ తర్వాత ఒకటి రెండు మ్యాచ్లు విఫలమైనా.. విశాఖ తీరానా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగి తన అసలు సిసలు ఆటను చూపించాడు.
అప్పటి నుంచి తనదైన ఆటతో ధోనీ భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించాడు. ఈ ఏడాది ఆగస్టు 15న తన అంతర్జాతీయ క్రికెట్కు ముగింపు పలికాడు. అయితే డిసెంబర్ 23 ధోనీకే కాదు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ప్రత్యేకమైన రోజే. ధోనీ అరంగేట్రం చేస్తే.. సచిన్ వీడ్కోలు పలికాడు అంతే. వంద శతకాలు, 34,357 పరుగులతో తనదైన ముద్ర వేసిన సచిన్ 8 ఏళ్ల క్రితం ఇదే రోజు (2012 డిసెంబర్ 23)న వన్డే క్రికెట్కు గుడ్బై చెప్పాడు. ఈ నిర్ణయం అప్పట్లో అభిమానులను ఎంతో బాధించింది. తన కెరీర్లో భారత్ తరఫున 200 టెస్టులు, 463 వన్డేలు, ఒక టీ20 ఆడిన సచిన్ 2013లో వెస్టిండీస్తో ఆఖరి టెస్టు ఆడాడు.