న్యూఢిల్లీ: జూనియర్ రెజ్లర్ హత్య కేసులో అరెస్టయిన ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సుశీల్పై ఢిల్లీ కోర్టు బుధవారం అభియోగాలు నమోదు చేసింది. హత్య, హత్యాయత్నం, దౌర్జన్యంతోపాటు చట్టవిరుద్ధమైన సమావేశం వంటి తదితర అభియోగాలను మోపింది. సుశీల్తోపాటు మరో 17 మందిపైనా అభియోగాలు ఖరారు చేసింది. పరారీలో ఉన్న మరో ఇద్దరినీ ఈ జాబితాలో చేర్చింది. రెండు సార్లు ఒలింపిక్ మెడల్స్ గెలిచిన సుశీల్ కుమార్.. రెజ్లర్ సాగర్ రానా హత్య కేసులో అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం అత్యధిక భద్రత ఉండే తీహార్లోని జైల్లో ఉంటున్నాడు.
ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియం వద్ద మే 4న యువ రెజ్లర్ సాగర్ రాణాతో పాటు అతని స్నేహితులు సోను, అమిత్ కుమార్పై సుశీల్ కుమార్ మరియు అతని స్నేహితులు దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. తీవ్ర గాయాలైన సాగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాడి అనంతరం పరారీలో ఉన్న సుశీల్ కుమార్తో పాటు సహ నిందితుడు అజయ్ కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. వీరు బెయిల్ కోసం దరఖాస్తు చేయగా కోర్టు తిరస్కరించింది. ఓ ఫ్లాట్ విషయంలోని గొడవ ఈ హత్యకు దారితీసిందని పోలీసుల విచారణలో తేలింది.
హత్య కేసు ఆరోపణలతో సుశీల్ కుమార్ సెంట్రల్ కాంట్రాక్టును భారత రెజ్లింగ్ సమాఖ్య రద్దు చేసింది. సుశీల్తో పాటు పూజా ధండాను కాంట్రాక్టు నుంచి తప్పించారు. వీరిద్దరికీ 2019లో సెంట్రల్ కాంట్రాక్టులు దక్కాయి. అనంతరం వీరు ఏ పోటీల్లోనూ పాల్గొనలేదు. సుశీల్ను భారతీయ రైల్వే శాఖ కూడా సస్పెండ్ చేసింది. మరో ప్రకటన చేసేవరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ఉత్తర రైల్వే స్పష్టం చేసింది. నార్తర్న్ రైల్వేలో సీనియర్ కమర్షియల్ మేనేజర్గా అతడు పనిచేసేవాడు.