
మిడి మిడి జ్ఞానంతో..
అయితే మ్యాచ్ అనంతరం ఓలీ రాబిన్సన్ ఆ ట్వీట్లపై స్పందిస్తూ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. యుక్త వయసులో మిడిమిడి జ్ఞానంతో ఆ తప్పు చేశానని, ఇప్పుడు తాను పరిణితి చెందానని, ఏదిఏమైనా తాను అలాంటి లింగ పక్షపాతంతో కూడిన జాత్యాంహకార వ్యాఖ్యలు చేసి ఉండకూడదని అంగీకరించాడు. గతంలో తన చర్యల వల్ల సిగ్గుపడుతున్నానని, దయ చేసి సభ్య సమాజం తనను మన్నించాలని విజ్ఞప్తి చేశాడు. 'అలాంటి ట్వీట్లు చేసినందుకు తీవ్రమైన బాధ కలుగుతోంది. నా చర్యల పట్ల సిగ్గు పడుతున్నా. అప్పుడు అనాలోచితంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించా. నా మానసిక స్థితి అప్పుడు సరిగా లేదు. నేను చేసిన పని క్షమించరానిది. అయినా మన్నించాలని అందరినీ కోరుతున్నా.

ఆ సంతోషం ఆవిరైంది..
ఇంగ్లండ్ తరఫున టెస్టు అరంగేట్రం చేశాననే గర్వం, మైదానంలో రాణించిన సంతోషంతో ఇప్పుడు నేనుండాల్సింది. కానీ గతంలో నా ప్రవర్తన ఓ కళంకంగా మారింది. గత కొన్నేళ్లుగా నా జీవితాన్ని ఉత్తమంగా మలుచుకునేందుకు శ్రమించా. కాస్త పరిణతి చెందా. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన దాని కారణంగా ఇప్పుడు నా జట్టు సహచరుల, ఇంగ్లండ్ బోర్డ్ ప్రయత్నాలపై ప్రభావం పడడం నాకిష్టం లేదు.'అని ఓలీ రాబిన్సన్ చెప్పుకొచ్చాడు. టీనేజర్గా ఉన్న తనపై ఇంగ్లాండ్ కౌంటీ జట్టు యార్క్షైర్ వేటు వేయడం వల్ల కఠిన పరిస్థితులు గడిపిన తాను ఆ విధంగా ట్వీట్లు చేసినట్లు రాబిన్సన్ పేర్కొన్నాడు.

భవిష్యత్తులో మరెవరూ..
ఈ అంశంపై ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్ గ్రహం థోర్పె స్పందిస్తూ.. భవిష్యత్తులో జాతీయ జట్టుకు ఎంపికయ్యే అటగాళ్లకు సంబంధించిన సోషల్ మీడియా చరిత్ర ఆయా దేశాలకు చెందిన క్రికెట్ బోర్డ్లు పరిశీలనలోకి తీసుకుంటాయేమోనని తెలిపాడు. యువ క్రికెటర్లు తెలిసి తెలియని వయసులో చేసిన తప్పుల కారణంగా వివాదాల్లో చిక్కుకోకుండా ఉండాలంటే ఇది సరైన నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డాడు. అయితే ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.. రాబిన్సన్ను సెకండ్ టెస్ట్ నుంచి తప్పించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

న్యూజిలాండ్ 378
న్యూజిలాండ్ అరంగేట్ర ప్లేయర్ డెవాన్ కాన్వే (200) డబుల్ సెంచరీతో కదం తొక్కడంతో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆ జట్టు 378 పరుగులకు ఆలౌటైంది. ఇతర బ్యాట్స్మెన్ విఫలమైన వేళ డెవాన్ కాన్వే ఒక్కడే.. ఒంటరిగా పోరాడాడు. సిక్స్తో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను స్ట్రైకింగ్ తీసుకోవాలనే ఆతృతలో రనౌటయ్యాడు. లార్డ్స్లో, ఇంగ్లండ్ గడ్డపై అరంగేట్రం చేస్తూ ఓ ఆటగాడు చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. బర్న్స్ (59), రూట్ (42) క్రీజులో ఉన్నారు.


Click it and Unblock the Notifications












