హైదరాబాద్: యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఒడిశా రైలు ప్రమాదంలో 275 మంది దుర్మరణం చెందగా.. 900 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులతో పాటు యావత్ భారత్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికగా మృతులకు సంతాపం ప్రకటించింది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కోసం ఇంగ్లండ్ వెళ్లిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశాడు. 'ఒడిశా రైలు ప్రమాదం ఘటన గురించి తెలిసి చాలా బాధపడ్డాను. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల బాధ గురించే ఆలోచిస్తున్నా. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా' అని కోహ్లీ ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్ అనంతరం రైల్వే ప్రమాద బాధితుల కోసం విరాట్ కోహ్లీ రూ.30 కోట్లు విరాళంగా ప్రకటించడాని, ప్రమాద సహాయనిధికి ఈ మొత్తాన్ని అందజేశాడనే ప్రచారం జోరు అందుకుంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విటర్ ఇలా ప్రతీ సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ వేదికగా కోహ్లీ రూ.30 కోట్లు విరాళంగా అందించాడనే పోస్ట్లు కనిపించాయి.
కోహ్లీతో పాటు మహేంద్ర సింగ్ ధోనీ కూడా రూ.60 కోట్లు విరాళంగా అందజేసాడని పోస్ట్లు కనబడ్డాయి. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ధోనీ.. ఈ ఘటన గురించి కనీసం స్పందించలేదు. ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. కానీ అతని ఫ్యాన్స్ రూ.60 కోట్లు విరాళంగా ఇచ్చాడని ప్రచారం మొదలుపెట్టారు.
ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ పోస్ట్లను నిజమని నమ్మిన ఫ్యాన్స్.. వాటిని షేర్ చేస్తూ తమ అభిమాన ఆటగాళ్లు చేసిన పని పట్ల గర్వం వ్యక్తం చేశారు. వాస్తవం ఏంటంటే.. కోహ్లీ, ధోనీ ఒక్క రూపాయి కూడా విరాళం ప్రకటించలేదు. ఈ పోస్ట్లపై ఒడిశా పోలీసులు స్పందించారు. ధోనీ, కోహ్లీ.. ఒడిశా ప్రమాద బాధితులకు విరాళాలు ఇవ్వలేదని, ఇలాంటి అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.