హైదరాబాద్: వన్డే ప్రపంచకప్లో భారత్-పాకిస్థాన్ పోరు అనగానే అందరికీ సచిన్ టెండూల్కర్ అసాధారణ ఇన్నింగ్స్ గుర్తుకొస్తోంది. ముఖ్యంగా నైంటీస్ ఫ్యాన్స్కు ఈ ఇన్నింగ్స్ మరిచిపోలేనిది. వన్డే ప్రపంచకప్ 2003లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో సచిన్ అసాధారణ బ్యాటింగ్తో జట్టుకు చిరస్మరణీ విజయాన్నందించాడు.
అప్పటికే వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్గా గుర్తింపు పొందిన షోయబ్ అక్తర్తో పాటు డేంజరస్ వసీం అక్రమ్లను చెడుగుడు ఆడాడు. తనదైన షాట్లతో అభిమానులను అలరించాడు. ఓవైపు కాళ్లు తిమ్మిర్లు ఎక్కినా.. డీహైడ్రేషన్తో బాధపడినా బైరన్నర్ సాయంతో జట్టు విజయానికి బాటలు వేసాడు. చివరకు 2 పరుగుల దూరంలో సెంచరీ చేజార్చుకున్నా.. భారత్కు మరిచిపోలేని విజయాన్ని అందించాడు.

వన్డే ప్రపంచకప్ 2023 నేపథ్యంలో మరోసారి సచిన్ టెండూల్కర్ ఇన్నింగ్స్ను అభిమానులు నెమరు వేసుకుంటున్నారు. సౌతాఫ్రికా వేదికగా జరిగిన ఆ ప్రపంచకప్లో సెంచూరియన్ మైదానంలో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వకార్ యూనీస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఓపెనర్లు సయీద్ అన్వర్, తఫీక్ ఉమర్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీన జహీర్ ఖాన్ విడదీసాడు. తఫీక్ ఉమర్(22)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత అబ్దుల్ రజాక్(12), ఇంజమామ్ ఉల్ హక్(6) విఫలమైనా.. మహమ్మద్ యూసఫ్(25), యూనిస్ ఖాన్(32) సాయంతో సయీద్ అన్వర్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఈ పరిస్థితుల్లో ఆశిష్ నెహ్రాను రంగంలోకి దింపిన సౌరవ్ గంగూలీ.. సయీద్ అన్వర్(101)ను ఔట్ చేసి ఫలితం రాబట్టాడు. అనంతరం రషీద్ లతీఫ్(29 నాటౌట్) రాణించడంతో పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 273 పరుగులు చేసింది. అప్పట్లో ఇది భారీ లక్ష్యమే. అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు అదిరిపోయే ఆరంభమే దక్కింది.
తొలి ఓవర్ నుంచే సెహ్వాగ్, సచిన్ ధాటిగా ఆడారు. ఈ ఇద్దరి విధ్వంసంతో భారత్ 5 ఓవర్లలో 50 పరుగులు చేసింది. సెహ్వాగ్(21), సౌరవ్ గంగూలీ(0)లను వకార్ యూనీస్ వరుస బంతుల్లో ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన మహమ్మద్ కైఫ్తో సచిన్ జట్టును ఆదుకున్నాడు. మూడో వికెట్కు 102 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు.

కైఫ్ ఔటైనా.. ద్రవిడ్తో కలిసి జట్టు విజయానికి బాటలు వేసాడు. ఈ క్రమంలో సచిన్ కాళ్ల తిమ్మిర్లతో బాధపడ్డాడు. వీరేంద్ర సెహ్వాగ్ను బైరన్నర్గా పెట్టుకొని పరుగులు రాబట్టాడు. సెంచరీకి 2 పరుగుల ముంగిట అక్తర్ బౌన్సర్కు క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో ఓ గొప్ప ఇన్నింగ్స్కు తెరపడింది. ఈ మ్యాచ్లో సచిన్ సెంచరీ సాధించకపోయినా.. ఈ 98 పరుగులకు అంతకు మించిన గుర్తింపు దక్కింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్(50)తో కలిసి ద్రవిడ్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. అయితే 32 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సచిన్ టెండూల్కర్ ఇచ్చిన సునాయస క్యాచ్ను అబ్దుల్ రజాక్ నేలపాలు చేశాడు. ఈ తప్పిదం పాకిస్థాన్ విజయవకాశాలను దెబ్బతీసింది. ఇదే జోరులో ఫైనల్ చేరిన టీమిండియా.. పటిష్ట ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడి వరల్డ్ కప్ను అందుకోలేకపోయింది.