హైదరాబాద్: క్రికెట్ను కెరీర్గా ఎంచుకున్న ప్రతీ ప్లేయర్.. ప్రపంచకప్ ఆడటంతో పాటు విశ్వ టైటిల్ను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు. రెండేళ్లకు ఒకసారి జరిగే టీ20 ప్రపంచకప్ కన్నా నాలుగేళ్లకు ఒకసారి జరిగే వన్డే ప్రపంచకప్కే అధిక ప్రాధ్యాన్యత. అలాంటి మెగా టోర్నీలో ఆడే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారితే ఆ ఆటగాళ్ల బాధ వర్ణాతీతం.
అయితే ఈ బాధను ఎక్కువగా మన తెలుగు ఆటగాళ్లే అనుభవించారు. సెలెక్షన్ కమిటీ చేసిన ఈ తప్పిదాలు టీమిండియా విజయవకాశాలను కూడా దెబ్బతీసాయి. 2003 ప్రపంచకప్ ముందు హైదరాబాద్ సొగసరి బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్కు చివరి నిమిషంలో మొండి చెయ్యి చూపించారు.
2019 వన్డే ప్రపంచకప్ ముంగిట తెలుగు తేజం అంబటి రాయుడుకు ఇలాంటి అన్యాయమే చేశారు. తాజాగా తిలక్ వర్మను కూడా పక్కనపెట్టడంతో టీమిండియాకు ఓటమి తప్పదా? అనే చర్చ జరుగుతోంది.

వీవీఎస్ లక్ష్మణ్..!: 2003 వన్డే ప్రపంచకప్కు ముందు టెస్ట్ క్రికెట్లో వీవీఎస్ లక్ష్మణ్ పేరు మారుమోగింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా అతని ఆడిన ఇన్నింగ్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రదర్శన వన్డే ఫార్మాట్లో అవకాశం అందుకున్న వీవీఎస్ లక్ష్మణ్ నిలకడగా రాణించాడు. ఆ సమయంలో ప్రపంచ క్రికెట్ను శాసిస్తున్న ఆస్ట్రేలియాపై అద్భుత బ్యాటింగ్తో చెలరేగాడు.
దాంతో 2003 వన్డే ప్రపంచకప్ జట్టులో లక్ష్మణ్కు చోటు ఖాయమని అంతా అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో బౌలింగ్ చేసే సామర్థ్యం కలిగిన దినేశ్ మోంగియాను సెలెక్ట్ చేశారు. ఆ టోర్నీలో అతను దారుణంగా విఫలమయ్యాడు. 11 మ్యాచ్ల్లో కేవలం 120 పరుగులే చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో టీమిండియా చిత్తుగా ఓడింది. ఆ జట్టపై మెరుగైన రికార్డు ఉన్న లక్ష్మణ్ను తీసుకుంటే టీమిండియా గెలిచేదనే అభిప్రాయం ఇప్పటికీ ఉంది.

అంబటి రాయుడు: 2019 వన్డే ప్రపంచకప్ సమయంలోనూ చివరి నిమిషంలో అంబటి రాయుడిని తప్పించి ఆల్రౌండర్ అయిన విజయ్ శంకర్ను ఎంపిక చేశారు. తెలుగు వాడైన ఎమ్మెస్కే ప్రసాద్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీనే ఈ తప్పిదం చేసింది. త్రీ డైమన్షల్ ఆటగాడని ఎమ్మెస్కే కామెంట్ చేయడం.. త్రీడీ కళ్లద్దాలతో చూస్తానని రాయుడు ట్వీట్ చేయడం దుమారం రేపింది.
తీరా ప్రపంచకప్లో విజయ్ శంకర్ దారుణంగా విఫలమయ్యాడు. గాయపడి టోర్నీ మధ్యలోనే భారత్కు వచ్చేసారు. అతని స్థానంలో దినేశ్ కార్తీక్ను ఆడించగా.. అతను దారుణంగా విఫలమయ్యాడు. న్యూజిలాండ్తో జరిగిన సెమీస్లో ఓడిన టీమిండియా ఇంటిదారి పట్టింది. రాయుడు ఉంటే కచ్చితంగా గెలిచేదనే అభిప్రాయం వ్యక్తమైంది.

తిలక్ వర్మ: తాజాగా తెలుగు తేజం తిలక్ వర్మను వన్డే ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడంతో మరోసారి ఇలాంటి ఫలితమే ఎదురవుతుందా? అనే చర్చ జరుగుతోంది. గత రెండు ఐపీఎల్ సీజన్లో నిలకడగా రాణించడంతో పాటు అరంగేట్రం చేసిన సిరీస్లో.. సీనియర్లంతా విఫలమైన వేళ తిలక్ వర్మ అసాధారణ బ్యాటింగ్ చేశాడు. లెఫ్టార్మ్ బ్యాటర్ కావడంతో యువరాజ్ సింగ్ స్థానాన్ని భర్తీ చేస్తాడని అంతా భావించారు.
దాంతోనే ఆసియాకప్కు ఎంపిక చేశారు. కానీ అనుభవం లేదని అతన్ని పక్కనపెట్టేసారు. గాయాల నుంచి కోలుకొని వచ్చిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్కు అవకాశం ఇచ్చారు. ఏమాత్రం ఫామ్లో లేని ఈ ఇద్దర్ని ఎంపిక చేసే బదులు తిలక్ వర్మను తీసుకుంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.