న్యూఢిల్లీ: క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో ఐసీసీ ప్రపంచకప్ సిద్దమవుతోంది. భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్లో జరిగే వన్డే ప్రపంచకప్కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ మరికొద్ది గంటల్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించనుంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీకి సంబంధించిన డ్రాఫ్ట్ షెడ్యూల్ బయటకు వచ్చింది.
ఐసీసీ ఆమోదం కోసం బీసీసీఐ వేచి చూస్తున్నట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే నేడు(సోమవారం) రాత్రిలోపు వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది. అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది.

ఈ టోర్నీ కోసం బీసీసీఐ 15 వేదికలను ఎంచుకుంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంతో పాటు చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, ముంబై, నాగ్పూర్, ఢిల్లీ, లక్నో, గౌహతి, రాజ్కోట్, కోల్కతా, తిరువనంతపురం, ఇండోర్, ధర్మశాల, అహ్మదాబాద్ వేదికలు ప్రపంచకప్కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ప్రపంచకప్ మ్యాచ్లు జరిగినా.. టీమిండియా మ్యాచ్ ఒక్కటి కూడా షెడ్యూల్ చేయలేదు.
ఇప్పుడు ఇదే హైదరాబాద్ అభిమానులను నిరాశ పరుస్తోంది. లీగ్ దశలో టీమిండియా మొత్తం 9 మ్యాచ్లు ఆడనుండగా.. చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, పుణే, ధర్మశాల, లక్నో, ముంబై, కోల్కతా, బెంగళూరు వేదికగా ఈ మ్యాచ్లు జరగనున్నాయి.
హైదరాబాద్ వేదికగా అక్టోబర్ 6, 12 తేదీల్లో పాకిస్థాన్ జట్టు క్వాలిఫయర్ జట్లతో మ్యాచ్ ఆడనుంది. ఇతర దేశాల మ్యాచ్లను కూడా షెడ్యూల్ చేశారు. హైదరాబాద్లో భారత్కు సంబంధించిన మ్యాచ్ షెడ్యూల్ చేయకపోవడంపై నగర అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని హైదరాబాద్ వేదికగా భారత్ మ్యాచ్ జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
కొందరు నెటిజన్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు సోషల్ మీడియా వేదికగా స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారు. 2011 వన్డే ప్రపంచకప్ సమయంలోనూ హైదరాబాద్కు అన్యాయం చేశారని, అప్పుడు కూడా భారత్ మ్యాచ్లను కేటాయించలేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.