న్యూఢిల్లీ: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూసిన వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్ను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. భారత్ వేదికగా అక్టోబర్-నవంబర్ మధ్య జరిగే 48 మ్యాచ్ల పూర్తి వివరాలను మంగళవారం వెల్లడించింది. షెడ్యూల్ రిలీజ్ చేసిన నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడిన మాటలను కూడా అభిమానులతో పంచుకుంది.
భారత్ వేదికగా జరిగే ఈ వన్డే ప్రపంచకప్ చాలా హోరాహోరీగా సాగనుందని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. ఈ టోర్నీలో ఎన్నో థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయని టీమిండియా కెప్టెన్గా అభిమానులకు హామీ ఇస్తున్నానని రోహిత్ శర్మ తెలిపాడు.

'ఈ ప్రపంచకప్ చాలా హోరాహోరీగా సాగనుంది. టీ20 ఫార్మాట్ నేపథ్యంలో క్రికెట్ గేమ్ చాలా వేగంగా మారింది. మునుపెన్నడూ లేని విధంగా అన్ని జట్లూ సానుకూల దృక్పథంతో బరిలోకి దిగనున్నాయి. ఇవన్నీ అభిమానులకు కావాల్సిన మజాను అందించనున్నాయి. ఎన్నో థ్రిల్లింగ్ మూమెంట్స్కు ఈ టోర్నీ వేదికగా నిలవనుంది.
మేం కూడా పకడ్బందీగా ప్రిపేర్ అవ్వడంపై ఫోకస్ పెట్టాం. అక్టోబర్-నవంబర్ మధ్య జరిగే ఈ టోర్నీలో టీమిండియా విజయం కోసం సాయశక్తులా పోరాడుతాం. స్వదేశంలో ప్రపంచకప్ ఆడనుండటం గొప్ప అనుభవం. ఇక్కడే 12 ఏళ్ల క్రితం భారత వన్డే ప్రపంచకప్ గెలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ ఈ టోర్నీలో మేం బరిలోకి దిగేందుకు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారనే విషయం నాకు తెలుసు.'అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
లీగ్ దశలో 10 జట్లు మొత్తం 45 మ్యాచ్లు ఆడనుండగా.. ఒక్కో జట్టు తొమ్మిదేసి మ్యాచ్లు ఆడనుంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుండగా.. అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న జరిగే మ్యాచ్లో దాయాదీ పాకిస్థాన్తో తలపడనుంది. నవంబర్ 15, 16న ముంబై, కోల్కతా వేదికగా సెమీ ఫైనల్ మ్యాచ్లు జరగనుండగా.. అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.
రెండు సెమీ ఫైనల్స్తోపాటు ఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డే (నవంబర్ 20)ను కేటాయించారు. ప్రపంచకప్ మ్యాచ్లను ధర్మశాల, ఢిల్లీ, లక్నో, పుణే, ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతా వేదికలుగా మ్యాచ్లు జరగనున్నాయి.