
మౌంట్ మాంగనుయ్: న్యూజిలాండ్-వెస్టిండీస్ జట్ల మధ్య సోమవారం జరగాల్సిన మూడో టీ-20 వర్షంతో రద్దయింది. 2.2 ఓవర్ల తర్వాత ఎడతెరిపి లేకుండా వాన కురవడంతో.. మిగతా ఆట సాధ్యం కాలేదు. భారీ వర్షం వల్ల ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. దాదాపు రెండు గంటల పాటు వేచి చూసిన అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో తొలి రెండు మ్యాచ్లు నెగ్గిన ఆతిథ్య న్యూజిలాండ్ 2-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డు న్యూజిలాండ్ బౌలర్ లూకీ ఫెర్గూసన్కి దక్కింది. ఫస్ట్ మ్యాచ్లో ఐదు వికెట్లు తీసిన ఫెర్గూసన్.. మొత్తం ఏడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
మూడో టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ప్రత్యర్థిని బ్యాటింగ్కు ఆహ్వానించింది. విండీస్ 2.2 ఓవర్ల వద్ద 25/1 స్కోరుతో ఉండగా వర్షం ప్రారంభమైంది. దీంతో అరగంట పాటు మ్యాచ్ని నిలిపేశారు. ఆతర్వాత చెరో ఐదు ఓవర్లు ఆడేలా మ్యాచ్ నిర్వహించేందుకు ప్రయత్నించగా వరుణుడు మరోసారి తన ప్రతాపం చూపడంతో మొత్తానికి ఆటను రద్దు చేశారు.
రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా డిసెంబర్ 3 నుంచి ఇరు జట్ల మధ్య హామిల్టన్లో ఫస్ట్ మ్యాచ్ మొదలవుతుంది.