
కరాచీ: న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో పాకిస్థాన్ శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి వన్డేలో పాకిస్థాన్ సమష్టిగా రాణించి 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది. ఈ గెలుపుతో కొత్త ఏడాది విజయాల ఖాతా తెరిచింది. న్యూజిలాండ్తో రెండు టెస్ట్ల సిరీస్ను డ్రా చేసుకున్న పాకిస్థాన్.. అంతకు ముందు ఇంగ్లండ్ చేతిలో ఖంగుతిన్నది. దాంతో ఈ విజయం ఆ జట్టుతో పాటు అభిమానులకు ఊరటినిచ్చింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 255 పరుగులు చేసింది. టామ్ లాథమ్(42), మైకేల్ బ్రేస్వెల్(43) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్(26)తో పాటు ఫిన్ అలెన్(29), డెవాన్ కాన్వే(0), గ్లేన్ ఫిలిప్స్(37) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. దాంతో న్యూజిలాండ్ సాధారణ స్కోర్కే పరిమితమైంది. పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా ఐదు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించాడు. ఉస్మా మిర్కు రెండు వికెట్లు దక్కగా.. మహమ్మద్ నవాజ్, మహమ్మద్ నసీమ్కు చెరొక వికెట్ లభించింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 48.1 ఓవర్లలో 4 వికెట్లకు 258 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఫఖార్ జమాన్(74 బంతుల్లో 7 ఫోర్లతో 56), బాబర్ ఆజామ్(82 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 66), మహమ్మద్ రిజ్వాన్(86 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 77) హాఫ్ సెంచరీలతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మైకేల్ బ్రేస్వెల్ రెండు వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ, గ్లేన్ ఫిలిప్స్ తలో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్కు పాకిస్థాన్ వైస్ కెప్టెన్ షాన్ మసూద్ను ఎంపిక చేయకపోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల కాలంలో షాన్ మసూద్ టీ20ల్లో నిలకడగా రాణిస్తుండటంతో వన్డే జట్టుకు ఎంపిక చేశారు. వైస్ కెప్టెన్గా కూడా ప్రమోషన్ ఇచ్చారు. కెప్టెన్ బాబర్ ఆజామ్ మాత్రం అతన్ని తుది జట్టులోకి కూడా తీసుకోలేదు.
షాన్ మసూద్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడం బాబర్ ఆజామ్కు ఇష్టం లేదేమోనని సందేహం వ్యక్తమవుతోంది. భవిష్యత్లో మసూద్ తన స్థానానికి ఎసరు పెట్టే అవకాశమున్నదని బాబర్ భయపడుతున్నాడమోనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మ్యాచ్కు ముందు టీమ్ కాంబినేషన్పై బాబర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. వైస్ కెప్టెన్ అయినా ఎవరైనా తనకు అనవసరమని, బెస్ట్ ఎలెవన్తో బరిలోకి దిగుతామని బాబర్ అన్నాడు. ఉద్దేశపూర్వకంగానే మసూద్ను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.