న్యూజిలాండ్ పర్యటనలో పాకిస్థాన్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఆతిథ్య న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో పాకిస్థాన్ వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓటమిపాలైంది. హామిల్టన్ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 194 పరుగులు చేసింది. ఫిన్ అలెన్(67 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లతో 74) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. కేన్ విలియమ్సన్(26), మిచెల్ సాంట్నర్(25) మెరుపులు మెరిపించారు. పాకిస్థాన్ బౌలర్లలో హ్యారీస్ రౌఫ్(3/38) మూడు వికెట్లు తీయగా.. అబ్బాస్ అఫ్రిది(2/43) రెండు వికెట్లు పడగొట్టాడు. ఆమెర్ జమాల్(1/42), ఉసమా మీర్(1/39)తలో వికెట్ తీసారు.

అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 19.3 ఓవర్లలో 173 పరుగులకే కుప్పకూలింది. బాబర్ ఆజామ్(43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 66), ఫకార్ జమాన్(25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. ఆడమ్ మిల్నే(4/33) నాలుగు వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ(2/31), బెన్ సీర్స్(2/28), ఇష్ సోధీ(2/33) రెండేసి వికెట్లు తీసారు.
భారీ లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్కు సరైన శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు సైమ్ ఆయుబ్(1), మహమ్మద్ రిజ్వాన్(7) దారుణంగా విఫలమయ్యారు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన బాబర్ ఆజామ్, ఫకార్ జమాన్ జట్టును ఆదుకున్నారు. వికెట్లు పడినా ఈ జోడి ధాటిగా ఆడటంతో పవర్ ప్లేలో పాకిస్థాన్ 2 వికెట్లకు 61 పరుగులు చేసింది.
పవర్ ప్లే అనంతరం అదే జోరు కనబర్చిన ఈ జోడీ వేగంగా పరుగులు చేసింది. ముఖ్యంగా ఫకార్ జమాన్ భారీ సిక్సర్లతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను మిల్నే బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 87 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
క్రీజులోకి ఇఫ్తికర్ అహ్మద్ రాగా.. బాబర్ ఆజామ్ 36 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. కానీ అతనికి మరో ఎండ్లో సహకారం లభించలేదు. ఇఫ్తికర్ అహ్మద్(4), ఆజామ్ ఖాన్, ఆమీర్ జమాల్(9) వరుస ఓవర్లలో పెవిలియన్ చేరారు. కెప్టెన్ షాహిన్ షా అఫ్రిది(22)తో కలిసి బాబర్ ఆజామ్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు.
కానీ బెన్ సీయర్స్ అతన్ని క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చి మ్యాచ్ను మలుపు తిప్పాడు. ఆ వెంటనే షాహిన్ షా అఫ్రిదిని మిల్నే ఔట్ చేయడంతో పాకిస్థాన్ ఓటమి ఖాయామైంది. అబ్బాస్ అఫ్రిది(7), ఉసామా మిర్(0) ఔటవ్వడంతో పాకిస్థాన్ పోరాటం ముగిసింది.