సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్ట్లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. మంగళవారం ముగిసిన ఈ మ్యాచ్లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 423 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. 658 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 234 పరుగులకే కుప్పకూలింది.
జాకోబ్ బెతెల్(96 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్తో 76), జో రూట్(64 బంతుల్లో 10 ఫోర్లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించగా.. గస్ అట్కిన్సన్(41 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 43) కాసేపు పోరాడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్(4/85) నాలుగు వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ(2/34), మ్యాట్ హెన్రీ(2/62) రెండేసి వికెట్లు పడగొట్టారు. విల్ ఓరూర్కీ ఓ వికెట్ పడగొట్టాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 347 పరుగులు చేసింది. టామ్ లాథమ్(63), మిచెల్ సాంట్నర్(76) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 143 పరుగులకే కుప్పకూలింది. మ్యాట్ హెన్రీ(4/48), విల్ ఓ రూర్కీ(3/33), మిచెల్ సాంట్నర్(3/7) ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు.
తర్వాత న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 453 పరుగుల భారీ స్కోర్ చేసింది. కేన్ విలియమ్సన్(204 బంతుల్లో 20 ఫోర్లు, సిక్స్తో 156) శతకంతో చెలరేగాడు. ఆల్రౌండ్ ప్రదర్శనతో న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన మిచెల్ సాంట్నర్(76, 3/7, 49, 4/85)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా.. 350 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచిన హ్యారీ బ్రూక్(350)కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్లో ఓడినా ఇంగ్లండ్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. తొలి రెండు టెస్ట్లో ఆ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే.
కెరీర్లో చివరి టెస్ట్ ఆడిన స్టార్ పేసర్ టీమ్ సౌథీకి న్యూజిలాండ్ ఘన విజయంతో వీడ్కోలు పలికింది. ఈ గెలుపుతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో న్యూజిలాండ్ నాలుగో స్థానానికి చేరుకోగా.. ఇంగ్లండ్ ఆరో ప్లేస్కు పడిపోయింది. శ్రీలంక ఐదో స్థానంలో కొనసాగుతుండగా.. టాప్-3లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, భారత్ ఉన్నాయి.