న్యూజిలాండ్ గడ్డపై ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్.. రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లోనూ శుభారంభం చేసింది. ఆదివారం ముగిసిన తొలి టెస్ట్లో 172 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. రెండు ఇన్నింగ్స్ల్లో నాథన్ లయన్(4/43, 6/65) న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు.
ఈ విజయంతో రెండు టెస్ట్ల సిరీస్లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 369 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన న్యూజిలాండ్ 196 పరుగులకు కుప్పకూలింది. రచిన్ రవీంద్ర(105 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 59), డారిల్ మిచెల్(130 బంతుల్లో 2 ఫోర్లతో 38) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

టామ్ లాథమ్(8), విల్ యంగ్(15), కేన్ విలియమ్సన్(9), టామ్ బ్లండెల్(0), గ్లేన్ ఫిలిప్స్(1) దారుణంగా విఫలమయ్యారు. టేయిలెండర్ స్కాట్ కుగ్గెల్జిన్(26) పోరాడే ప్రయత్నం చేశాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ 6 వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్కు తలో వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 383 పరుగులకు ఆలౌటైంది. కామెరూన్ గ్రీన్(275 బంతుల్లో 23 ఫోర్లు, 5 సిక్స్లతో 174 నాటౌట్) అజేయ సెంచరీతో రాణించాడు. 176 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును టెయిలెండర్లతో కలిసి ఆదుకున్నాడు.

అనంతరం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 179 పరుగులకు కుప్పకూలింది. మ్యాట్ హెన్రీ(43) మినహా అంతా విఫలమయ్యారు. 184 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. 164 పరుగులకే ఆలౌటైంది. గ్లేన్ ఫిలిప్స్(5/45) సంచలన ప్రదర్శన కనబర్చాడు. భారీ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కామెరూన్ గ్రీన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మార్చి 8 నుంచి ప్రారంభం కానుంది.