చెన్నై: వన్డే ప్రపంచకప్ 2023లో న్యూజిలాండ్ జోరు కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్లోనూ గెలుపొందింది. పసికూన అఫ్గానిస్థాన్తో బుధవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్.. 149 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. చెత్త ఫీల్డింగ్, పేలవ బ్యాటింగ్ అఫ్గాన్ పతనాన్ని శాసించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 288 పరుగులు చేసింది. కెప్టెన్ టామ్ లాథమ్(74 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 68), గ్లేన్ ఫిలిప్స్(80 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 71), విల్ యంగ్( 64 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 54) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.

అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఓమర్జాయి, నవీన్ ఉల్ హక్ రెండేసి వికెట్లు తీయగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన అఫ్గానిస్థాన్ 34.4 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలి ఘోర పరాభావాన్ని మూటగట్టుకుంది. రెహ్మత్ షా(36), అజ్మతుల్లా ఓమార్జాయ్(27) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్(3/39), లాకీ ఫెర్గూసన్(3/19) తీన్మార్ వేయగా.. ట్రెండ్ బౌల్ట్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీసారు. గత మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ను మట్టికరిపించి సంచలన విజయాన్ని నమోదు చేసిన అఫ్గాన్.. ఈ మ్యాచ్లో మాత్రం ఆ జోరు కొనసాగించలేకపోయింది.
చెత్త ఫీల్డింగ్తో ఘోర పరాభావాన్ని మూటగట్టుకుంది. మొత్తం 6 క్యాచ్లతో పాటు ఓ రనౌట్, స్టంపౌట్ చేజార్చుకొని ఘోర పరాజయం చవిచూసింది. మెరుగ్గా ఫీల్డింగ్ చేసి కివీస్ను తక్కువ స్కోర్కు కట్టడి చేసుంటే ఈ మ్యాచ్లోనూ అఫ్గాన్ సంచలన విజయాన్ని నమోదు చేసేది. విజయాన్నందుకోకపోయినా.. కనీసం గొప్ప పోరాటమైనా చేసేది. కివీస్ బౌలర్ల ముందు అఫ్గాన్ బ్యాటర్లు నిలబడలేకపోయారు. వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు.