ముంబై: ఐపీఎల్ 2023 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. హోరా హోరీ మ్యాచ్లతో అభిమానులకు కావాల్సిన మజా లభిస్తోంది. టాప్ టీమ్స్ అన్నీ దారుణంగా విఫలమవుతుండగా.. అంచనాల్లేని అనామక జట్లు అసాధారణ ప్రదర్శనతో చెలరేగుతున్నాయి. దాంతో ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్ గెలిచే జట్టు ఏదా? అనే చర్చ ఊపందుకుంది.
ఇప్పటికే చాలా మంది మాజీ క్రికెటర్లు తమ అంచనాలను వెల్లడించారు. ఒక్కో ప్లేయర్ ఒక్కో టీమ్ పేరు చెప్పారు. జట్టు బలాలు బలహీనతల ఆధారంగా వారు విజేతను అంచనా వేసారు. అయితే క్రికెట్లో బాగా నమ్మే సంఖ్యా శాస్త్రం ప్రకారం ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్ చేరే జట్ల వివరాలను ప్రముఖ న్యూమరాలజిస్ట్ గౌతమ్ అజాద్ వెల్లడించారు.

తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వేదికగా నాలుగు టీమ్స్ పేర్లను చెప్పిన ఆయన.. బ్లూ కలర్ జెర్సీ కలిగిన జట్టునే టైటిల్ వరిస్తుందని స్పష్టం చేశారు. 2023 ఏడాదిలో అంకెలన్నీ కలిపితే వచ్చేది 7 అని, సంఖ్యా శాస్త్రంలో 7 నెంబర్ నీలం రంగును సూచిస్తోందని పేర్కొన్నారు. బ్లూ కలర్ జెర్సీతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్కు టైటిల్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు.
ఈ మూడు జట్లతో పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరుతుందన్నారు. ఐపీఎల్ 2023 ఫైనల్ ముందు టైటిల్ గెలిచే జట్టుకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడిస్తానని తెలిపారు. కెప్టెన్ను మారిస్తే మాత్రం ఆ జట్ల విజయాలపై ప్రభావం ఉంటుందని, తన ప్రెడిక్షన్లో మార్పులు కూడా జరుగుతాయని స్పష్టం చేశారు.
విచిత్రకరమైన విషయం ఏంటంటే ఆజాద్ చెప్పిన నాలుగు జట్లలో ఒక్క లక్నో మాత్రమే టాప్-3లో ఉంది. మిగతా మూడు జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 3 ఓటములతో చివరి స్థానంలో ఉండగా.. ముంబై ఇండియన్స్ 2 ఓటములతో 9వ స్థానంలో నిలిచింది. ఒక్క విజయంతో ఆర్సీబీ ఏడో స్థానంలో కొనసాగుతోంది.