టెస్ట్ క్రికెట్లో క్రికెట్ గాడ్, టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మాత్రమే అధిగమించగలడని ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. మరో మూడేళ్ల పాటు జో రూట్ నిలకడగా ఆడగలిగితే సునాయసంగా టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలుస్తాడని అభిప్రాయపడ్డాడు.
ఇటీవలే జో రూట్ టెస్ట్ల్లో 12 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఏడో బ్యాటర్గా నిలిచాడు. వెస్టిండీస్తో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన మ్యాచ్లో జో రూట్ ఈ ఫీట్ సాధించాడు. జో రూట్ సాధించిన ఈ ఘనతతో సచిన్ వరల్డ్ రికార్డ్ అధిగమిస్తాడనే చర్చ జోరుగా సాగుతోంది.

తన కెరీర్లో 200 టెస్ట్ మ్యాచ్లు ఆడిన సచిన్ టెండూల్కర్ 51 సెంచరీలతో 15,921 పరుగులు చేశాడు. అతనికి దరిదాపుల్లో మరే ఆటగాడు కూడా లేడు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో జోరూట్ మాత్రమే సచిన్ తర్వాత 7వ స్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ 8,848 పరుగులతో 19వ స్థానంలో ఉన్నాడు.
'జో రూట్ మాత్రమే సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డ్ను అధిగమించగలడు. అతనికి ఇప్పుడు 33 ఏళ్లు మాత్రమే. ప్రస్తుతం అతను 3000 పరుగులు మాత్రమే వెనుకంజలోనే ఉన్నాడు. అయితే అతను ఎన్ని మ్యాచ్లు ఆడుతాడనే దానిపైనే ఆధారపడి ఉంది. అతను ఏడాదికి 10 నుంచి 14 మ్యాచ్లు ఆడి 800 నుంచి 1000 పరుగులు చేస్తే.. మూడు, నాలుగేళ్లలో ఈ రికార్డును అధిగమిస్తాడు.
ఈ లెక్కన అతను 37 ఏళ్ల వయసులో సచిన్ రికార్డ్ అధిగమించగలడనుకుంటున్నా. పరుగులు చేయాలనే ఆకలితో ఉంటే.. ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు. గత కొన్నేళ్లుగా మరింత మెరుగైన ఆటగాళ్లలో జో రూట్ ఒకడు. చిన్న స్కోర్లను పెద్దగా మార్చడంలో అతనికి తిరుగులేదు.
నాలుగు, ఐదేళ్ల క్రితం అతను హాఫ్ సెంచరీలను శతకాలుగా మార్చుకునేందుకు ఇబ్బంది పడేవాడు. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. హాఫ్ సెంచరీ సాధిస్తే సునాయసంగా సెంచరీ కొడుతున్నాడు.'అని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.