టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సిరీస్ విజయంతో తమ శకాన్ని ప్రారంభించారు. శ్రీలంక పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్లు గెలిచిన టీమిండియా.. మూడు టీ20ల సిరీస్ను 2-1తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది.
ఆదివారం జరిగిన రెండో టీ20లో డక్ వర్త్ లూయిస్ పద్దతిన 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో భారత్ లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులకు కుదించారు. భారత బ్యాటర్లు 6.3 ఓవర్లలోనే 81 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకున్నారు.

ఈ మ్యాచ్కు వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మెడనొప్పితో దూరం కాగా.. అతని స్థానంలో సంజూ శాంసన్ తుది జట్టులోకి వచ్చాడు. అయితే ఈ అవకాశాన్ని అతను అందిపుచ్చుకోలేకపోయాడు. గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. దాంతో సంజూ శాంసన్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సంజూ శాంసన్ను తప్పుబడుతున్నారు.
ఇర్ఫాన్ పఠాన్ అయితే సంజూ శాంసన్ కంటే రియాన్ పరాగ్కే ఎక్కువ అవకాశాలు దక్కుతాయని జోస్యం చెప్పాడు. టీమిండియా టాపార్డర్ బ్యాటర్లలో బౌలింగ్ చేసే సామర్థ్యం ఎవరికి లేకపోవడం రియాన్ పరాగ్కు కలిసొచ్చే అంశమని అభిప్రాయపడ్డాడు. సంజూ శాంసన్ కంటే రియాన్ పరాగ్కు అవకాశం ఇవ్వడమే సరైన నిర్ణయమని ట్వీట్ చేశాడు.
'బౌలింగ్ సామర్థ్యం ఉన్న రియాన్ పరాగ్కు మరిన్ని అవకాశాలు దక్కుతాయి. టీమిండియా టాపార్డర్ బ్యాటర్లలో బౌలింగ్ చేసే ఆటగాడు లేడు. ఇది రియాన్ పరాగ్కు ఎక్స్ట్రా అడ్వాంటేజ్. అతన్ని జట్టులో కొనసాగించడం సరైన నిర్ణయం'అని పఠాన్ పేర్కొన్నాడు.
తొలి టీ20 విజయానంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా రియాన్ పరాగ్ను మెచ్చుకున్నాడు. అతను టీమిండియా ఎక్స్ ఫ్యాక్టర్ అని కొనియాడాడు. 'రియాన్ పరాగ్ ప్రత్యేకం. ఎందుకంటే అతని బౌలింగ్ను ఐపీఎల్లో కంటే ముందే నెట్స్లో చూశాను. అందుకే ప్రెస్ కాన్ఫరెన్స్లో రియాన్ పరాగ్ ఎక్స్ ఫ్యాక్టర్ అని పేర్కొన్నాను.'అని సూర్య చెప్పుకొచ్చాడు. శ్రీలంకతో వన్డే సిరీస్కు కూడా రియాన్ పరాగ్ ఎంపికయ్యాడు.