టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై దిగ్గజ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇప్పటి వరకు భారత్ చూసిన గ్రేటెస్ట్ రోల్మోడల్ అతనేనని కొనియాడాడు. టీ20 ప్రపంచకప్ 2024లో దారుణంగా విఫలమైన విరాట్ కోహ్లీ.. సౌతాఫ్రికాతో జరిగిన కీలక ఫైనల్లో మాత్రం విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.
కీలక ఆటగాళ్లంతా విఫలమైన వేళ విరాట్ కోహ్లీ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. 76 పరుగుల కీలక ఇన్నింగ్స్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. దాంతో పరిమిత ఓవర్ల క్రికెట్లో ఐసీసీ టైటిళ్లన్నీ అందుకున్న ఏకైక క్రికెటర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు.

కోహ్లీ అండర్ 19 ప్రపంచకప్తో పాటు వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఆటగాడిగా రికార్డ్ సాధించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ కూడా గెలిస్తే.. ఐసీసీ టైటిళ్లన్నిటిని అందుకున్న ఆటగాడిగా చరిత్రకెక్కుతాడు. టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా ప్రదర్శనపై అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన సిద్ధూ.. కోహ్లీని తాను ఓ ఐకాన్గా గుర్తుంచుకుంటానని తెలిపాడు.
'టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత విజయం కోసం యావత్ భారత్ ప్రార్థనలు చేసింది. 150 కోట్ల మంది కష్టాల నుంచి భారత్ను గట్టెక్కించాలని ప్రార్థించారు. అలాంటి సమయంలో విరాట్ కోహ్లీ భారత ఇన్నింగ్స్కు అడ్డుగోడలా నిలిచాడు. కీలక బ్యాటర్లు విఫలమైన వేళ కఠిన పరిస్థితుల్లో అద్భుత బ్యాటింగ్తో జట్టును అదుకున్నాడు. అసాధారణ ప్రదర్శనతో టీమిండియాను విశ్వవిజేతగా నిలబెట్టాడు.

విరాట్ కోహ్లీ ఓ పోరాట యోధుడు, జనాకర్షక ఆటగాడు, క్రికెట్ మాస్టర్, జీనియస్.. అతన్ని నేను ఎప్పుడూ ఓ ఐకాన్గానే చూస్తాను. అతను అందరికి స్పూర్తిదాయకం. క్రికెట్ చూసే అభిమానులందరికి టీమిండియా ప్రపంచకప్ విజయం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇప్పటి వరకు భారత్ చూసిన గ్రేటెస్ట్ రోల్మోడల్ విరాట్ కోహ్లీ. అతనికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రపంచకప్ అందించిన కోహ్లీకి నా సెల్యూట్'అని సిద్ధూ చెప్పుకొచ్చాడు.
టోర్నీ మొత్తం విఫలమైన కోహ్లీ.. ఫైనల్లో మాత్రం అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తన సహజశైలిలో ఆచితూచి ఆడిన కోహ్లీ.. 76 పరుగుల కీలక ఇన్నింగ్స్తో టీమిండియాకు 176 పరుగుల పోరాడే లక్ష్యాన్ని అందించాడు. అనంతరం సౌతాఫ్రికా ఒత్తిడికి చిత్తయ్యి ఓటమిని చవిచూసింది.