టీమిండియా రైజింగ్ స్టార్ అభిషేక్ శర్మ.. తన ఆరాధ్య క్రికెటర్ ఎవరో చెప్పాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ల్లో భారత్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన యురాజ్ సింగే తన ఆరాధ్య దైవమని అభిషేక్ శర్మ తెలిపాడు. 2007 టీ20 ప్రపంచకప్లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో యువరాజ్ సింగ్ కొట్టిన 6 బంతుల్లో 6 సిక్స్లను చూసి తాను క్రికెటర్ కావాలని నిర్ణయించుకున్నానని అభిషేక్ శర్మ గుర్తు చేసుకున్నాడు.
తన అభిమాన ఆటగాడి మార్గదర్శకంలోనే తాను ప్రొఫెషనల్ క్రికెటర్గా ఎదగడం సంతోషంగా ఉందని చెప్పాడు. జింబాబ్వే పర్యటనతో అంతర్జాతీయ టీ20ల్లోకి అడుగుపెట్టిన అభిషేక్ శర్మ.. రెండో మ్యాచ్లోనే విధ్వంసకర శతకంతో చెలరేగాడు. ఈ సిరీస్లో బ్యాట్తో కాకుండా బౌలింగ్లోనూ సత్తా చాటి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అభిషేక్ శర్మ మెరుగైన ప్రదర్శన చేసినా.. సీనియర్ల రీఎంట్రీతో శ్రీలంక పర్యటనకు ఎంపికచేయలేదు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిషేక్ శర్మ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'నేను రంజీ క్రికెట్లోకి అరంగేట్రం చేసినప్పుడు తొలిసారి యువరాజ్ సింగ్ను కలిసాను. అప్పుడు నా వయసు 16 ఏళ్లు. అది యువరాజ్ సింగ్కు కమ్బ్యాక్ సీజన్. అతను ఆ సీజన్లో 800-900 రన్స్ చేశాడు. అప్పటికే అతను నా ఆరాధ్య క్రికెటర్. 2007 టీ20 ప్రపంచకప్ విజయంతోనే యువరాజ్ సింగ్ను నేను ఆరాధించడం మొదలుపెట్టాను.

ఆ టోర్నీలో యువరాజ్ సింగ్ ఆటను చూసి అతనిలా బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ చేయాలని అనుకునేవాడిని. అతను నన్ను తీవ్రంగా ప్రభావితం చేశాడు. దాంతో డ్రెస్సింగ్ రూమ్లో యువరాజ్ సింగ్ వైపు అలానే చూస్తూండేవాడిని.'అని అభిషేక్ శర్మ గుర్తు చేసుకున్నాడు. భారత్ గెలిచిన 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో అభిషేక్ శర్మనే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు.
2019లో రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ సింగ్... ఆ తర్వాత పంజాబ్లోని కొంతమంది కుర్రాళ్లకు మెంటార్గా వ్యవహరించాడు. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ యువరాజ్ సింగ్ మార్గదర్శకంలోనే ఎదిగినవారే. ఐపీఎల్ 2024 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున సంచలన ప్రదర్శన కనబర్చిన అభిషేక్ శర్మ.. జింబాబ్వే పర్యటన కోసం తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్నాడు.