టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై స్టార్ పేసర్ మహమ్మద్ షమీ ప్రశంసల జల్లు కురిపించాడు. విరాట్ కోహ్లీ భారత క్రికెట్ వెన్నుముక అని కొనియాడాడు. నేటి(నవంబర్ 5)తో విరాట్ కోహ్లీ 36వ ఏట అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అతని పుట్టిన రోజు సందర్భంగా విరాట్ కోహ్లీకి అభిమానులు, మాజీ, సహచర క్రికెటర్లు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేశారు.
కెరీర్లో కోహ్లీ మరిన్ని ఘనతలు సాధించాలని ఆకాంక్షించారు. అతనికి సంబంధించిన చిరస్మరణీయ ఇన్నింగ్స్లను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే మహమ్మద్ షమీ కూడా సోషల్ మీడియా వేదికగా విరాట్ కోహ్లీకి బర్త్ డే విషెస్ తెలియజేశాడు. టీమిండియా వెన్నుముక అంటూ కొనియాడాడు.

'భారత క్రికెట్ వెన్నుముక, పరుగుల యంత్రానికి జన్మదిన శుభాకాంక్షలు. కోహ్లీ.. ఆటపై నీకున్న అంకిత భావం, పిచ్చి ఎంతోమందిలో స్ఫూర్తిని కలిగిస్తోంది. ఈ ఏడాది కూడా నువ్వు మరింత సక్సెస్ అవ్వాలని, సంతోషంగా గడుపుతూ మరిచిపోలేని అనుభూతులను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నా'అని షమీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.
చీల మండ గాయంతో భారత జట్టుకు దూరమైన మహమ్మద్ షమీ గతేడాదిగా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. అతను చివరిసారిగా గతేడాది నవంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.
దాంతో గతేడాదిగా ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఇటీవలే గాయం నుంచి పూర్తిగా కోలుకొని ప్రాక్టీస్ ప్రారంభించిన మహమ్మద్ షమీ.. న్యూజిలాండ్తో మూడు టెస్ట్ల సిరీస్ లేదా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్తో రీఎంట్రీ ఇస్తాడని అంతా భావించారు. కానీ ఈ రెండు సిరీస్లకు అతన్ని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు.
ఇటీవలే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ పూర్తి చేసుకొని ఫిట్నెస్ టెస్ట్ కూడా పాసయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చే ముందు దేశవాళీ క్రికెట్ ఆడుతానని ఓ ఇంటర్వ్యూలో షమీ తెలిపాడు. రంజీ ట్రోఫీలో రెండు మ్యాచ్లు ఆడి సత్తా చాటి.. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతానని చెప్పాడు.
గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని కూడా స్పష్టం చేశాడు. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులోనూ షమీకి చోటు దక్కలేదు. దాంతో బెంగాల్ తరఫున షమీ.. రంజీ ట్రోఫీ ఆడుతాడని అంతా భావించారు. కానీ తదుపరి రెండు రౌండ్ల రంజీ మ్యాచ్లకు సంబంధించి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ సోమవారం ప్రకటించిన రంజీ జట్టులో మహమ్మద్ షమీకి చోటు దక్కలేదు. దాంతో అతని రీఎంట్రీ మరింత ఆలస్యం కానుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోనే వరుస అవకాశాలు అందుకున్న షమీ స్టార్ పేసర్గా ఎదిగాడు.