సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు కూడా టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ దూరం కానున్నాడు. రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా కోల్కతా వేదికగా జరిగిన తొలి టెస్ట్లో శుభ్మన్ గిల్ గాయపడిన సంగతి తెలిసిందే. మూడు బంతులు మాత్రమే ఆడిన గిల్.. మెడనరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత నొప్పి తీవ్ర కావడంతో అతన్ని ఆసుప్రతికి తరలించి చికిత్స అందించారు.
24 గంటల పర్యవేక్షణ అనంతరం శుభ్మన్ గిల్ను డిశ్చార్జ్ చేయగా.. రెండో టెస్ట్ కోసం జట్టుతో కలిసి అతను గౌహతి వచ్చాడు. కానీ మ్యాచ్ ఆడే ఫిట్నెస్ సాధించకపోవడంతో గిల్ను ముంబైకి తరలించినట్లు తెలుస్తోంది. శుభ్మన్ గిల్కు తగిన విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.

వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ 2026 జరగనున్న నేపథ్యంలో గిల్ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దని బీసీసీఐ భావిస్తోంది. ఈ క్రమంలోనే వన్డే సిరీస్ నుంచి అతనికి విశ్రాంతి ఇవ్వాలనే యోచనలో భారత జట్టు ఉన్నట్లు తెలుస్తోంది. వన్డేల్లో శుభ్మన్ గిల్కు డిప్యూటీగా ఉన్న శ్రేయస్ అయ్యర్ కూడా తీవ్ర గాయంతో జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే.
ఆసీస్ పర్యటనలో క్యాచ్ పట్టే క్రమంలో అతని పక్కటెముకల భాగంలో తీవ్ర గాయమైంది. ప్లీహంలో చీలిక రావడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అయ్యర్ వేగంగా కోలుకుంటున్నా.. మ్యాచ్ ఫిట్నెస్ సాధించేందుకు మరింత సమయం పట్టనుంది. అతను ఐపీఎల్ 2026 సీజన్తోనే మైదానంలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే సౌతాఫ్ఱికాతో వన్డే సిరీస్లో భారత జట్టును ఎవరు నడిపిస్తారనేది చర్చనీయాంశమైంది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మనే మళ్లీ భారత జట్టును నడిపిస్తాడనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ భారత సెలెక్టర్లు కేఎల్ రాహుల్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తాత్కలిక సారథ్య బాధ్యతలు రాహుల్కు అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.
గతంలో టీమిండియా వైస్ కెప్టెన్గా ఉన్న రాహుల్.. మూడు ఫార్మాట్లలో తాత్కలిక సారథిగా సేవలందించాడు. 2023లో అతని వైస్ కెప్టెన్సీపై వేటు పడింది. రాహుల్ 12 వన్డేల్లో సారథ్యం వహించగా భారత్ 8 విజయాలు సాధించింది. ప్రస్తుతం అతను వన్డేల్లో రెగ్యులర్ వికెట్ కీపర్గా కొనసాగుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అతను ప్రధాన వికెట్ కీపర్గా ఆడాడు. అతనికి బ్యాకప్గా రిషభ్ పంత్ బెంచ్కే పరిమితమయ్యాడు.
నవంబర్ 30న రాంచీ వేదికగా జరిగే తొలి మ్యాచ్తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. రాయ్పూర్ వేదికగా డిసెంబర్ 3న రెండో వన్డే, డిసెంబర్ 6న వైజాగ్ వేదికగా మూడో వన్డే జరగనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ సిరీస్తో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ సిరీస్లో బరిలోకి దిగే భారత జట్టును అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ ఇంకా ప్రకటించలేదు. మరో రెండు రోజుల వ్యవధిలోనే ఈ జట్టును ప్రకటించే ఛాన్స్ ఉంది.