ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్కమిన్స్పై టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ తరం అత్యుత్తమ కెప్టెన్ అని కొనియాడాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కంటే కూడా కమిన్స్ మెరుగైన సారథని పరోక్షంగా అభిప్రాయపడ్డాడు.
ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. 10 ఏళ్ల తర్వాత టీమిండియా 1-3తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆసీస్కు కోల్పోయింది.

అంతకుముందు సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరిగిన మూడు టెస్ట్ల సిరీస్లోనూ టీమిండియా క్లీన్ స్వీప్ అయ్యింది. ఈ పరాజయాలతో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. దాంతో కెప్టెన్ రోహిత్ శర్మపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు 2021లో ఆసీస్ సారథ్య బాధ్యతలు చేపట్టిన కమిన్స్.. డబ్ల్యూటీసీ 2023, వన్డే ప్రపంచకప్ 2023, యాషెస్ సిరీస్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టైటిళ్లను అందించాడు. ఈ క్రమంలోనే అతని సారథ్యంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. దినేశ్ కార్తీక్కు కూడా కమిన్స్ సారథ్యాన్ని కొనియాడాడు.

'నా అభిప్రాయం ప్రకారం ప్రస్తుత సమయంలో ప్యాట్ కమిన్స్ అత్యుత్తమ కెప్టెన్. మంచి దూకుడైన ఆటగాడు. అయితే తన దూకుడును మాటల్లో.. తిట్లలో కాకుండా ఆటలో చూపిస్తున్నాడు. తనదైన శైలిలో పోస్ట్ మ్యాచ్, ప్రీ మ్యాచ్ ప్రజెంటేషన్స్లో మీడియాను హ్యాండిల్ చేస్తున్నాడు. జట్టును అద్భుతంగా నడిపించే సత్తా అతనికి ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోనే కమిన్స్ నెంబర్ వన్ కెప్టెన్.'అని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.
ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ప్యాట్ కమిన్స్ ఆల్రౌండ్ షో కనబర్చాడు. బౌలర్గా 25 వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్లోనూ విలువైన పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా డబ్ల్యూటీసీ చరిత్రలోనే 200 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్గా చరిత్రకెక్కాడు.

శ్రీలంకతో జరిగే ఆస్ట్రేలియా అప్కమింగ్ రెండు టెస్ట్ల సిరీస్కు కమిన్స్ దూరమయ్యాడు. ఇటీవలే తండ్రైన కమిన్స్ పెటర్నిటీ లీవ్ తీసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అతను దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చీలమండ గాయంతో కమిన్స్ బాధపడుతున్నట్లు వార్తలు వచ్చాయి.