టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఆల్టైమ్ ఇండియా టీ20 ఎలెవన్ను ప్రకటించాడు. భారత్ గెలిచిన 2007 టీ20 ప్రపంచకప్ జట్టులో సభ్యుడైన దినేశ్ కార్తీక్ తాజాగా అత్యుత్తమ భారత టీ20 జట్టు వివరాలను వెల్లడించాడు. ఈ జట్టుకు రోహిత్ శర్మను కాకుండా అరంగేట్ర టీ20 ప్రపంచకప్ను గెలిపించిన మహేంద్ర సింగ్ ధోనీని సారథిగా ఎంపిక చేశాడు.
యువ ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు రోహిత్ శర్మను ఆల్టైమ్ ఎలెవన్లో దినేష్ కార్తీక్ ఓపెనర్లుగా తీసుకున్నాడు. 17 టీ20లే ఆడిన అభిషేక్ శర్మ 535 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలతో పాటు 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

విరాట్ కోహ్లీని నెంబర్ 3 బ్యాటర్గా పేర్కొన్నాడు. కోహ్లీ సైతం టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను నాలుగో స్థానంలో ఎంపిక చేసిన కార్తీక్.. స్పిన్ ఆల్రౌండర్లు యువరాజ్ సింగ్, అక్షర్ పటేల్ను ఎంపిక చేశాడు. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పేరును దినేష్ కార్తీక్ విస్మరించాడు. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యాను తీసుకున్న దినేష్ కార్తీక్.. ఈ జట్టు కెప్టెన్గా ధోనీని ఎంపిక చేశాడు. అతన్నే వికెట్ కీపర్ అని తెలిపిన కార్తీక్.. నెంబర్ 7 బ్యాటర్గా పేర్కొన్నాడు.
జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్లను పేసర్లుగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తీని తీసుకున్నాడు. బుమ్రా, వరుణ్ చక్రవర్తీ ఆసియా కప్ 2025 ఆడేందుకు సిద్దమవుతుండగా.. భువనేశ్వర్ కుమార్ జట్టుకు ఎప్పుడో దూరమయ్యాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ 18 టీ20ల్లోనే 33 వికెట్లు పడగొట్టాడు.
దినేశ్ కార్తీక్ ఆల్టైమ్ టీ20 ఎలెవన్: ఎంఎస్ ధోనీ(కెప్టెన్), రోహిత్ శర్మ, అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, యువరాజ్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తీ.