ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ రికార్డ్ ధరను దక్కించుకున్న విషయం తెలిసిందే. రూ. 27 కోట్ల భారీ ధరకు అతన్ని లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా రిషభ్ పంత్ను తిరిగి తీసుకునే ప్రయత్నం ఢిల్లీ క్యాపిటల్స్ చేయగా.. లక్నో అమాంతం అతని ధరను పెంచేసింది. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ వెనుకడుగు వేయాల్సి వచ్చింది.
వాస్తవానికి మెగా వేలంలో తాము తీసుకోవాలనుకుంది రిషభ్ పంత్ను కాదని, టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను కొనుగోలు చేయాలనుకున్నామని ఢిల్లీ క్యాపిటల్స్ కో-ఓనర్ పార్థ్ జిందాల్ తెలిపారు. కానీ పంజాబ్ కింగ్స్ అతన్ని రూ. 26.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేయడంతో వెనకడుగు వేసామని చెప్పాడు. తమ తొలి ప్రాధాన్యత ఆటగాడు చేజారడంతోనే పంత్ కోసం ప్రయత్నించామని వివరించాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్, రిషభ్ పంత్ ఆలోచనలు వేర్వేరుగా ఉండటంతోనే అతన్ని వేలంలోకి వదిలేసామని కూడా పార్థ్ జిందాల్ స్పష్టం చేశాడు. 'ఫ్రాంచైజీని నడిపించే విషయంలో రిషభ్ పంత్తో ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ భేదాభిప్రాయాలు వచ్చాయి. అతని నాయకత్వం గురించి మేం (సహ యజమాని కిరణ్ గ్రంధి, జిందాల్) ఇచ్చిన ఫీడ్ బ్యాక్ను రిషభ్ పంత్ మరోలా అర్థం చేసుకున్నాడు. దాంతో భావోద్వేగపూరితమైన నిర్ణయం తీసుకున్నాడు.
రిషభ్ పంత్ను జట్టులో కొనసాగించేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నింటినీ చేశాం. టీమిండియాకు సారథ్యం వహించాలన్నది అతని కోరిక. ఐపీఎల్లో కెప్టెన్గా తన సారథ్య ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అతన్ని ఆపేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించాం. కానీ పంత్ వెళ్లిపోవాలనుకున్నాడు.
ఎప్పుడైతే పంత్ను రిటైన్ చేసుకోలేదో అప్పుడే అతని కోసం వేలంలో మళ్లీ ప్రయత్నించవద్దని అనుకున్నాం. కానీ అతనితో ఉన్న సత్సంబంధాలతోనే వేలంలో ఆర్టీఎమ్ కార్డ్ ఉపయోగించాం. వాస్తవానికి పంత్.. వేలంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడే నేను, కిరణ్ మరో ప్రత్యామ్నాయ ఆటగాడిని టార్గెట్ చేయాలనుకున్నాం.
శ్రేయస్ అయ్యర్ను మా ప్రైమరీ టార్గెట్గా పెట్టుకున్నాం. కానీ అతన్ని పంజాబ్ రూ. 26.75 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. మా ప్రైమరీ టార్గెట్ అయిన శ్రేయస్ మిస్సవ్వడం.. అతని తర్వాతే పంత్ వేలంలోకి రావడం.. రూ. 20.75 కోట్ల వద్దే బిడ్ ఆగిపోవడంతో ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా తీసుకోవాలనుకున్నాం. కానీ లక్నో ధరను భారీగా పెంచేసింది. రూ. 23 కోట్ల వరకైతే పంత్ కోసం పెట్టాలనుకున్నాం.'అని జిందాల్ పార్థ్ చెప్పుకొచ్చాడు.