టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు యువ ప్లేయర్ రియాన్ పరాగ్పై మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ ఇద్దరూ టీమిండియా భవిష్యత్తు ఫినిషర్లని కొనియాడాడు. అప్కమింగ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో పాటు టీ20 ప్రపంచకప్ 2026లో ఈ ఇద్దరూ కీలకమవుతారని జోస్యం చెప్పాడు.
బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. మూడు టీ20ల సిరీస్ కోసం సిద్దమైంది. నేడు(ఆదివారం) గ్వాలియర్ వేదికగా జరిగే తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. టెస్ట్ సిరీస్ ఆడిన ఆటగాళ్లందరికి ఈ టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చారు. దాంతో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో కుర్రాళ్లతో కూడిన భారత జట్టు.. బంగ్లాదేశ్తో అమీతుమీ తేల్చుకోనుంది.

ఈ సిరీస్ నేపథ్యంలో మాట్లాడిన దినేశ్ కార్తీక్.. హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్ టీమిండియా ఫినిషర్లుగా సత్తా చాటుతారని జోస్యం చెప్పాడు. జట్టులో విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ ఉన్నా.. అతని గురించి ప్రస్తావించలేదు. 'ఏ టీమ్కు అయినా అత్యుత్తమ ఫినిషర్ అవసరం. కానీ, భారత్కు డబుల్ ధమాకా వంటి ఇద్దరు ఫినిషర్లు ఉన్నారు.
అప్కమింగ్ టీ20 ప్రపంచకప్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ ఇద్దరూ ఫినిషర్లుగా సత్తా చాటుతారు. రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా ఫినిషర్ల పాత్ర పోషించనున్నారు. ఇప్పటికే హార్దిక్ పాండ్యా మంచి ఫినిషర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. గుజరాత్ టైటాన్స్తో పాటు టీమిండియా తరఫున ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్లు ఆడాడు.
ఫినిషర్ పాత్రకు హార్దిక్ సరిగ్గా సరిపోతాడు. చివర్లో దూకుడుగా ఆడాల్సిన బ్యాటర్లు జట్టులో ఉండటం అవసరం. రియాన్ పరాగ్ కూడా అలాంటి నైపుణ్యం కలిగిన ఆటగాడే. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ అతను సత్తా చాటగలడు. అందుకే హార్దిక్ పాండ్యాతో పాటు రియాన్ పరాగ్ కూడా మంచి ఆల్రౌండరని చెబుతున్నా. అప్కమింగ్ మెగా టోర్నీల్లో భారత్ విభిన్నమైన కాంబినేషన్తో బరిలోకి దిగే అవకాశం ఉంది.'అని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.