టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తన ఆల్టైమ్ ఆరాధ్య క్రికెటర్ అని సంజూ శాంసన్ తెలిపాడు. ఈ తరం వికెట్ కీపర్లంతా ధోనీ, ఆడమ్ గిల్ క్రిస్ట్ తమ ఫేరవరేట్ క్రికెటర్లు అని చెబుతుంటే సంజూ శాంసన్ మాత్రం భిన్నంగా రోహిత్ శర్మ చెప్పాడు. తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంజూ శాంసన్ ఈ విషయాన్ని తెలియజేశాడు. రోహిత్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.
ఈ తరం క్రికెట్లో అశ్విన్కు నచ్చే ఆటగాడు ఎవరా? అని సంజూ శాంసన్ ప్రశ్నించగా.. అతను 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పేరు చెప్పాడు. అతని ఆటను చూసేందుకు తాను చాలా ఉత్సాహం చూపిస్తానని చెప్పాడు. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తనకు చివరి నిమిషంలో చోటు దక్కలేదని, ఈ విషయాన్ని రోహిత్ శర్మనే వెల్లడించాడని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు. ఆ సందర్భంగా అతను మాట్లాడిన మాటలతోనే అభిమానిగా మారిపోయానని చెప్పాడు.
'టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ ఆడే అవకాశం నాకు వచ్చింది. మ్యాచ్కు ముందు సిద్దంగా ఉండాలని చెప్పారు. నేను కూడా రెడీ అయ్యాను. సరిగ్గా టాస్ ముందే తుది జట్టులో ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగుతున్నామని చెప్పారు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాను. వామప్ సమయంలో రోహిత్ నన్ను పక్కకు తీసుకెళ్లి మాట్లాడాడు. ఆ నిర్ణయం వెనుక గల కారణాన్ని వెల్లడించాడు. నేను వెంటనే అర్థం చేసుకోగలను. ముందు మ్యాచ్ గెలవండి. ఆ తర్వాత మాట్లాడుకుందామని చెప్పాను.

ఒక్క నిమిషం తర్వాత మళ్లీ నా దగ్గరకు వచ్చిన రోహిత్.. నాకు తెలుసు నువ్వు నన్ను తిట్టుకుంటున్నావు. నువ్వు సంతోషంగా లేవు. నీ మనసులో ఏదో ఉందని అన్నాడు. నేను ఓ ఆటగాడిగా ఆడాలనుకుంటున్నాను. కానీ అంతకంటే ముందు ఈ జట్టు గెలవడం ముఖ్యమని చెప్పాను. అప్పుడే రోహిత్ వ్యక్తిత్వం ఏంటో నాకు అర్థమైంది. వరల్డ్ కప్ ఫైనల్ ముందు జట్టులో లేని ఆటగాడికి 10 నిమిషాలు కేటాయించి.. జట్టులోకి ఎందుకు తీసుకోలేదోనని చెప్పడం మాములు విషయం కాదు.
ఎవరూ కూడా ఇలా చేయరు. నేను అయితే నా బ్యాటింగ్పై ఫోకస్ పెట్టేవాడిని. తర్వాత మాట్లాడుతాలే అనుకునేవాడిని. కానీ రోహిత్ మాత్రం అలా చేయకుండా నన్ను ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఆ క్షణమే అతను నా మనసులో చోటు సంపాదించాడు. ఈ జీవితాంతం అతను అక్కడే ఉంటాడు.'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.