మెగా వేలంలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ను కొనుగోలు చేయడమే తమకు పెద్ద డీల్ అని సన్రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ డానియల్ వెటోరీ అన్నాడు. ఆదివారం జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఇషాన్ కిషన్ను సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 11.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అతన్ని దక్కించుకోవడంపై వెటోరి సంతోషం వ్యక్తం చేశాడు. జట్టులో ఇషాన్ కిషన్ కీలక ఆటగాడిగా ఎదుగుతాడని అభిప్రాయపడ్డాడు.
అయితే యార్కర్ల కింగ్ నటరాజన్ను కోల్పోవడం తమకు నిరాశపరిచే విషయమన్నాడు. నటరాజన్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని చెప్పాడు.

'ఇషాన్ కిషన్ను కొనుగోలు చేయడం మాకు పెద్ద డీల్. మేం అతన్ని కొనుగోలు చేయాలనుకున్నాం. అతడిని దక్కించుకోవడం సంతోషంగా ఉంది. కానీ నటరాజన్ను కోల్పోవడం బాధగా ఉంది. అతని కోసం ఢిల్లీ క్యాపిటల్స్తో తీవ్రంగా పోటీపడ్డాం. కానీ అతను మాకు దక్కలేదు. అతని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు.
వేలానికి సంబంధించి వ్యూహాలపై మా కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో మాట్లాడాం. అతను చేసిన సూచనలను కూడా పరిగణలోకి తీసుకున్నాం. పెర్త్ టెస్ట్ ఓటమితో అతనిరి ఈ రోజు కఠినంగా మారింది. అయినా అతనితో మాట్లాడాం. ఆటగాళ్లను కొనుగోలు చేయడం వెనుక ఉన్న లాజిక్లను వివరించాం. జట్టు నిర్మాణం గురించి వివరించాం. అతను అర్థం చేసుకున్నాడు.'అని డానియల్ వెటోరీ చెప్పుకొచ్చాడు.
తొలి రోజు మెగా వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ మహమ్మద్ షమీ(రూ. 10 కోట్లు), ఇషాన్ కిషన్ (రూ.11.25 కోట్లు), హర్షల్ పటేల్(రూ. 8 కోట్లు) అభినవ్(రూ. 3.20 కోట్లు), రాహుల్ చాహర్ (రూ. 3.20 కోట్లు), ఆడమ్ జంపా (రూ. 2.40 కోట్లు), సిమర్జీత్ సింగ్ (రూ. 1.50), అథర్వ టైడ్ (రూ.30 లక్షలు)లను కొనుగోలు చేసింది.
వేలంలో దూకుడుగా వ్యవహరించి 8 మంది ఆటగాళ్లను దక్కించుకుంది. వీరి కోసం రూ. 114.85 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు దగ్గర రూ. 5.15 కోట్లు మాత్రమే ఉండగా.. ఓ ఆర్టీఎమ్ కార్డ్ అందుబాటులో ఉంది. ఇంకా ఆ జట్టు 12 మంది ఆటగాళ్లను తీసుకోవాలి. ఇందులో నలుగు విదేశీ ఆటగాళ్లకు అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న బడ్జెట్ నేపథ్యంలో సన్రైజర్స్.. అనామక ఆటగాళ్లపై మాత్రమే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.