ఈ ఏడాది జూన్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2024లో ఆస్ట్రేలియా విజేతగా నిలుస్తుందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్(Michael Vaughan) జోస్యం చెప్పాడు. టీ20 ర్యాంకింగ్స్లో టాప్లో ఉన్న భారత్, ఇంగ్లండ్ కంటే ఆసీస్కే విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపాడు. పాకిస్థాన్ జట్టుకు కూడా టైటిల్ గెలిచే సత్తా లేదని అభిప్రాయపడ్డాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 ఎడిషన్కు వెస్టిండీస్, అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. జూన్ 1 నుంచి 29 వరకు ఈ మెగా టోర్నీ జరగనుండగా.. ఐసీసీ ఇప్పటికే షెడ్యూల్ను ప్రకటించింది. మొత్తం 20 జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి.

తాజాగా ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మైకేల్ వాన్.. టీ20 ప్రపంచకప్ విజేతను అంచనా వేసాడు. భారత్, పాకిస్థాన్తో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్కు కూడా టైటిల్ గెలిచే సత్తా లేదని చెప్పాడు. విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ కలిగిన ఆస్ట్రేలియానే విజేతగా నిలుస్తుందని జోస్యం చెప్పాడు.
'ఈసారి టీ20 ప్రపంచకప్ను ఆస్ట్రేలియా గెలుచుకుంటోంది. వన్డే ప్రపంచకప్ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియానే టీ20 ప్రపంచకప్(T20 World Cup 2024) విజేతగా నిలుస్తుందని భావిస్తున్నా. ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది. టీ20 క్రికెట్కు కావాల్సిన అన్ని వనరులు ఆ జట్టులో ఉన్నాయి. ఏ క్షణంలోనైనా మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలిగే బ్యాటర్లు ఆ జట్టులో ఉన్నారు.
ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, గ్లేన్ మ్యాక్స్వెల్, ఇంగ్లీస్, వేడ్, టీమ్ డేవిడ్లతో బ్యాటింగ్ భీకరంగా ఉంది. బౌలింగ్ విభాగంలోనూ అన్ని వేరియేషన్స్ కలిగిన బౌలర్లు ఉన్నారు. వైవిధ్యంగా బౌలింగ్ చేసే పేసర్లతో పాటు స్పెషలిస్ట్ స్పిన్నర్లు కూడా ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్లో ఆ జట్టుకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి.'అని మైకేల్ వాన్ చెప్పుకొచ్చాడు.
ఇక మైకేల్ వాన్ ప్రిడిక్షన్ను భారత అభిమానులు తప్పుబడుతున్నారు. భారత్పై అక్కసు వెళ్లగక్కడమే మైకేల్ వాన్ పనని, అతని ప్రిడిక్షన్ ఇప్పటి వరకు ఒక్కటి కూడా నిజం కాలేదని, పూటకో మాట మాట్లాడుతాడని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే మైకేల్ వాన్ గత నవంబర్లో టీ20 ప్రపంచకప్ 2024ను పాకిస్థాన్ గెలుస్తుందని చెప్పాడని, ఇప్పుడు ఆసీస్ అంటున్నాడని మండిపడుతున్నారు.